Begin typing your search above and press return to search.

తిరుపతిలో దారుణం.. అన్నతో తాగి.. వదిన.. పిల్లల్ని చంపేశాడు

వదిన.. ఇద్దరు పిల్లల్ని చంపేసి.. తాను సూసైడ్ చేసుకున్న ఈ దారుణ ఉదంతంలోకి వెళితే..

By:  Tupaki Desk   |   25 July 2024 4:36 AM GMT
తిరుపతిలో దారుణం.. అన్నతో తాగి.. వదిన.. పిల్లల్ని చంపేశాడు
X

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఇలాంటి ఘోరాన్ని జీర్ణించుకోవటం ఒకింత కష్టంగా ఉండే పరిస్థితి.తిరుపతిలో వెలుగు చూసిన దారుణం భయానకంగా ఉండటమే కాదు.. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదన్న భావన కలుగుతుంది. తనను ఎంతో ఇష్టంగా చూసుకునే అన్న కుటుంబాన్ని చిదిమేసిన ఈ సైకో తమ్ముడి ఆరాచకం తిరుపతిలో సంచలనంగా మారింది. వదిన.. ఇద్దరు పిల్లల్ని చంపేసి.. తాను సూసైడ్ చేసుకున్న ఈ దారుణ ఉదంతంలోకి వెళితే..

తిరుపతి పద్మావతి నగర్ కు చెందిన టీపీ దాస్.. వైసీపీ కార్యకలాపాలు చూస్తుంటాడు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరఫు పని చేశాడు. అతడి నివాసం కూడా తిరుపతినే. దాసుకు ఒక తమ్ముడు (మోహన్) ఉన్నాడు. అతడో ఐటీ ఉద్యోగి. అతడికి 2019లో పెళ్లైంది. కొన్ని కారణాలతో దంపతులు ఇద్దరు విడిపోయారు. దీంతో.. అన్నవదినలు కలిసి రెండో పెళ్లి చేశారు. అయితే.. ఆ అమ్మాయి కూడా మోహన్ ను విడిచి పెట్టి వెళ్లిపోయింది.

ఇదిలా ఉంటే బుధవారం తిరుపతిలోని తన అన్న దాసు ఇంట్లో ఉన్నాడు మోహన్. వారిద్దరూ కలిసి సాయంత్రం వేళలో ఫుల్ గా తాగేశారు. కాసేపటికి దాసు బయటకు వెళ్లాడు. అప్పుడే ట్యూషన్ నుంచి తిరిగి వచ్చారు దాసు భార్య.. ఇద్దరు కుమార్తెలు. ఇంతలో ఏమైందో కానీ మోహన్ ఉన్మాదిగా వ్యవహరిస్తూ.. వదినను కత్తితో పొడిచి చంపేశాడు. అన్న పిల్లలు ఇద్దరిని సైతం కత్తితో విచక్షణ రహితంగా పొడిచేశాడు.

వీరిని బయటకు తరలించే ప్రయత్నం చేసి.. సాధ్యం కాకపోవటంతో భయంతో ఇంట్లోనూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకువెళ్లిన దాసు కాసేపటికి ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టగా.. తలుపు తీయలేదు. దీంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు బద్ధలు కొట్టగా.. రక్తం మడుగులో దాసు సతీమణి.. ఇద్దరు పిల్లలతో పాటు.. మరో రూంలో మోహన్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వైనాన్ని చూశారు. ఈ ఉదంతం తిరుపతి పట్టణంలో షాకింగ్ గా మారింది. అయితే.. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతోనే ఇలా చేశారన్న మాట వినిపిస్తోంది. అయితే.. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.