Begin typing your search above and press return to search.

ఆర్టీసీ డ్రైవర్‌ పై దాడి... నిందితుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు!

కావలి - తుమ్మలపెంట మార్గంలో రాష్ట్రం దాటేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:36 AM GMT
ఆర్టీసీ డ్రైవర్‌  పై దాడి... నిందితుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు!
X

కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ రాం సింగ్ పై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ ఏ చెడు జరిగినా దాన్ని అధికార పార్టీకి ఆపాదించే కార్యక్రమాల్లో భాగంగా... ఆ పనికి పూనుకున్నాయి విపక్షాలు. ఇందులో భాగంగా నారా లోకేష్.. ఈ దాడి పూర్తిగా వైసీపీకి సంబంధించినవారే చేయించారని చెప్పుకొచ్చారు! అయితే ఈ ఆరోపణలు చేసిన 24 గంటల్లోనే వాస్తవాలు బహిర్గతం అయ్యాయ్యి. ఆ నిందితులు ఎవరు.. ఏ పార్టీకి చెందిన వారు.. అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి!


అవును... కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ రాం సింగ్ పై జరిగిన దాడిలో నిందితుల బ్యాక్ గ్రౌండ్ తెరపైకి వచ్చింది. కావలి - తుమ్మలపెంట మార్గంలో రాష్ట్రం దాటేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా... బండి విల్సన్, షేక్‌ ఖాజావలి, కుప్పాల వంశీ, పుట్టా శివకుమార్‌ రెడ్డి, షేక్‌ కలీం చోటు, షేక్‌ ఇలియాజర్, షేక్‌ బాజీలను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఇలా దాడి జరిగిన 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మిగతా ఏడుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారని తెలుస్తుంది. వీరిలో ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌ తోపాటు మిగిలినవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించి అన్ని చోట్లా విస్తృతంగా గాలిస్తున్నారని తెలుస్తుంది. పోలీసులు ఇలా అత్యంత వేగంగా స్పందించిన విధానంపై అటు ప్రజల నుంచి, ఇటు ఆర్టీసీ యూనియన్ల నుంచీ హర్షం వ్యక్తమవుతుంది.


ఇందులో భాగంగా.. ఘటన అనంతరం ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్‌ చేయడం పట్ల ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా... ముఖ్యమంత్రి జగన్‌ తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావుకు యూనియన్లు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. అంతకముందే... ఈ ఉదంతం వెలుగులోకి రాగానే నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ సంఘాలకు ఎండీ భరోసానిచ్చారు.

వాస్తవానికి రాం సింగ్ పై దాడికి పాల్పడిన నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉంది. అయితే వారు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కాదని స్పష్టం అవుతుంది. ఈ సందర్భంగా వారి పొలిటికల్ యాక్టివిటీస్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కావలి ప్రాంతంలో వీళ్ళు ఎన్నో ఏళ్లుగా రౌడీయిజం, సెటిల్‌ మెంట్లు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని తెలుస్తుంది. ఈ నిందితులపై గతంలోనే పోలీసులు సస్పెక్ట్‌ షీట్లు తెరిచారు.


ఇందులో భాగంగా... దేవరకొండ సుధీర్ పై కావలి టూ టౌన్ స్టేషన్ లో 13 కేసులు, కే పట్నం పోర్ట్ పరిధిలో ఒక కేసు, ఇతర జిల్లాల్లో 7 కేసులు ఉన్నాయి. గుర్రంకొండ కిషోర్ పై కావలిలో 10 కేసులు ఉన్నాయి. ఇక గుర్రంకొండ అరున్ కుమార్ పై 2 కేసులు, కర్రెద్దుల విజయ్ కుమార్ పై 9 కేసులు, పుట్టా శివకుమార్ రెడ్డిపై 8 కేసులు ఉన్నాయని తెలుస్తుంది.

ఇదే క్రమంలో... ఆర్టీసీ డ్రైవర్‌ రాం సింగ్ పై దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా.. సెక్షన్ 143, 341, 332, 307, 323, 427 రెడ్‌ విత్‌ 34 సీఐపీ కింద కావలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో ఆర్టీసీ డ్రైవర్‌ పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని స్థానిక ప్రజలు స్పష్టం చేస్తున్నారు. దాడి చేసిన రౌడీలు "ఐ సపోర్ట్‌ బాబు" బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా.. మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు. వీరికి ఆ రాజకీయ పార్టీలతొ ఉన్న అనుబంధానికి సంబంధించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి!

దీంతో.. నిన్నటివరకూ ఈ దాడిని అధికార వైఇసీపీకి అంటగట్టే ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు... సైలంట్ అయిపోయారని తెలుస్తుంది. దీంతో... వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్, పవన్‌ కల్యాణ్‌ బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారని, దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.