Begin typing your search above and press return to search.

వాలంటీర్ల విషయంలో బాబు సంచలన నిర్ణయం

కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో వాలంతీర్లు ఎన్నికల ముందు తప్పుకోవాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   28 Oct 2024 3:39 AM GMT
వాలంటీర్ల విషయంలో బాబు సంచలన నిర్ణయం
X

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆశయం మంచిదే కానీ ఆచరణలో గాడి తప్పింది. ఆఖరుకు ఎంతలా అంటే వారిని వైసీపీ కార్యకర్తలుగా ఏకంగా మంత్రుల నుంచి ప్రభుత్వ పెద్దల దాకా అంతా బాహాటంగానే చెప్పుకొచ్చారు. దాని వల్ల మేలు కంటే కీడే జరిగింది.

కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో వాలంతీర్లు ఎన్నికల ముందు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం వారి చేత రాజీనామాలు చేయించి అధికారికంగా పార్టీ కోసం పని చేయించుకున్నారు. ఆ విధంగా మొత్తం ఏపీలోని రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో లక్ష మంది దాకా తప్పుకున్నారు.

అయితే వాలంటీర్లను తమ ప్రభుత్వం వస్తే బాగా చూసుకుంటామని వారికి పది వేల గౌరవ వేతనం ఇవ్వడం ద్వారా సేవలను కొనసాగిస్తామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ వాలంటీర్ల విషయంలో అయితే ఎటూ తేల్చలేదు. దాంతో వారు ఉద్యమబాట పడతామని హెచ్చరిస్తున్నారు అయితే మంత్రి వర్గ సమావేశాలలో వాలంటీర్ల ప్రస్తావన వస్తోంది కానీ ఎటూ తేల్చలేకపోతున్నారు.

వాలంటీర్ల వ్యవస్థ వల్ల వైసీపీకి మంచి కంటే చెడ్డ ఎక్కువ మూటకట్టుకుని పరిస్థితి వచ్చిందని టీడీపీలో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. దాంతో పాటుగా వారు వస్తే ప్రజా ప్రతినిధుల ప్రాధాన్యత తగ్గిపోతుందని కూడా భావిస్తున్నారు. అందుకే వారిని కంటిన్యూ చేయడానికి ఒప్పుకోవడం లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మదిలో మాత్రం వాలంటీర్ల వ్యవస్థ విషయంలో కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. వాలంటీర్లను కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

వాలంటీర్లలో నిజాయితీపరులను చిత్తశుద్ధి కలిగిన వారిని పనితీరు బాగా తెలిసిన వారిని విద్యార్హతలు బట్టి తీసుకుని వారికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి సేవలు వాడుకోవాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. వాలంటీర్లను కొన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఉపయోగించుకోవడం ద్వారా వారి ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బలమైన వారధిని ఏర్పాటు చేసుకోవాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

వైసీపీ వాలంటీర్ల విషయంలో చేసిన తప్పులు చేయకుండా బాగా నడిపిస్తే మంచి వ్యవస్థగా ఉంటుందని కూడా ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక మొత్తం వాలంటీర్లను తీసుకోవడం కంటే రాజీనామా చేసిన వారిని పక్కన పెట్టి మిగిలిన వారిలో కూడా సరైన ఎంపిక చేసుకుని అవసరమైన మేరకు తీసుకోవడం ద్వారా మాట నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వాలంటీర్ల వ్యవస్థ తొందరలోనే పురుడు పోసుకోనుందని అంటున్నారు.

నవంబర్ 6న జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు ఒక మంచి నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. ఈసారి వచ్చే వాలంటీర్లు టీడీపీ శిక్షణలో తర్ఫీదు తీసుకుని జనంలోకి వెళ్తారని అంటున్నారు.