Begin typing your search above and press return to search.

ఇదే హైలెట్‌.. ముద్దుల చెల్లిపై బాలయ్య అనురాగం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణస్వీకారం సందర్భంగా అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి

By:  Tupaki Desk   |   12 Jun 2024 9:52 AM GMT
ఇదే హైలెట్‌.. ముద్దుల చెల్లిపై బాలయ్య అనురాగం!
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణస్వీకారం సందర్భంగా అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. చల్లటి వాతావరణం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అతిరథ, మహారథుల మధ్య ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.

ప్రమాణస్వీకార మహోత్సవానికి నారా, నందమూరి, మెగా కుటుంబాలు హాజరై సందడి చేశాయి. ప్రముఖ హీరోలు రామ్‌ చరణ్, సాయిధరమ్‌ తేజ్, నారా రోహిత్, నిఖిల్‌ కూడా హాజరయ్యారు.

కాగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వేదికపై కూర్చుని ఉన్నారు. అప్పటికి ప్రధాని మోదీ, చంద్రబాబు వేదికపైకి చేరుకోలేదు. ఈ క్రమంలో ఆమె వెనుకగా వచ్చిన ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరి భుజం తట్టి అభినందించారు. ఆమె భావోద్వేగానికి గురి కావడంతో ఆప్యాయంగా ఆమె భుజంపై చేయి వేశారు. తలపై చేయి వేసి దీవెనలు అందించారు. అంతేకాకుండా తన చెల్లి భువనేశ్వరి నుదిటిని బాలయ్య ఆప్యాయంగా ముద్దాడారు.

భువనేశ్వరి.. బాలకృష్ణకు స్వయానా సొంత చెల్లెలు అనే విషయం తెలిసిందే. బాలయ్య తన పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణిని తన మేనల్లుడు, చంద్రబాబు, భువనేశ్వరిల కుమారుడైన నారా లోకేశ్‌ కు ఇచ్చి వివాహం జరిపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన చెల్లెలు భువనేశ్వరిని బాలయ్య ముద్దాడటం అక్కడ ఉన్న నందమూరి, నారా కుటుంబాలను భావోద్వేగానికి గురి చేసింది. భువనేశ్వరి కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. తన అన్న బాలయ్య భుజం తట్టి.. ఆప్యాయంగా తన తలపై చేయి వేసి దీవించగానే భువనేశ్వరి సంతోషంతో చిరునవ్వులు చిందించారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరించడానికి కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు పోటీలు పడ్డారు. నారా, నందమూరి కుటుంబాల అభిమానులు కేరింతలు కొట్టారు.

గతంలో భువనేశ్వరిని అవమానిస్తూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసినప్పుడు నందమూరి కుటుంబమంతా ఆమెకు అండగా నిలబడింది. ముఖ్యంగా బాలయ్య వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. తమ సహనం నశిస్తే తన అభిమానులు ఏం చేస్తారో కూడా తెలియదని ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

అలాగే చంద్రబాబు జైలుపాలయినప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా బాలయ్య అనుక్షణం తన చెల్లిని, కుమార్తెను కంటికి రెప్పలా కాపాడారు.

ఇప్పుడు మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో భువనేశ్వరి నుదిటిపై ముద్దుపెట్టుకుని బాలయ్య తన ప్రేమను చాటుకున్నారు. కాగా బాలయ్య అక్క పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.