Begin typing your search above and press return to search.

షేక్ హసీనా మీద అతి పెద్ద కుట్ర...భారత్ హెచ్చరికలు భేఖాతర్ !

ఇది నిజంగా అత్యంత అవమానకరంగా సాగింది. అయితే దీని వెనక ఉన్నది సైనిక కుట్ర అని అంటున్నారు. ఆమె నమ్మిన ఆర్మీ చీఫ్ నే మోసం చేసి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 4:53 PM GMT
షేక్ హసీనా మీద అతి పెద్ద కుట్ర...భారత్ హెచ్చరికలు భేఖాతర్ !
X

భారర్ పొరుగుదేశం బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్ బంగ్లాదేశ్ ల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఇపుడు జరుగుతున్న పరిణామాలు దానిని దెబ్బ తీసేలా ఉన్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే పదిహేనేళ్ళ పాటు ప్రధానిగా ఆ దేశాన్ని ఏలిన పవర్ ఫుల్ విమెన్ లీడర్ షేక్ హసీనా సడెన్ గా గద్దె దిగి రాజీనామా చేసి వెళ్ళిపోయారు.

ఇది నిజంగా అత్యంత అవమానకరంగా సాగింది. అయితే దీని వెనక ఉన్నది సైనిక కుట్ర అని అంటున్నారు. ఆమె నమ్మిన ఆర్మీ చీఫ్ నే మోసం చేసి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు. దాంతో చివరికి ఆమె అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో తన పదవిని వదులుకోవడం కాదు భారత్ కి రక్షణ కోసం పారిపోయి వచ్చారన్న అప్రతిష్టను మూటకట్టుకున్నారు.

ఇంతకీ ఆమెను వెన్నుపోటు పొడిచిన ఆ ఆర్మీ చీఫ్ ఎవరు అంటే వకార్ ఉజ్ జమాన్ అని అంటున్నారు. చిత్రమేంటి అంటే ఆయనను స్వయంగా ఏరి కోరి షేక్ హసీనా ఈ ఏడాది జూన్ 23న ఆర్మీ చీఫ్ గా చేశారు. ఈ విషయం షేక్ హసీనాను భారత్ హెచ్చరించింది. జమాన్ అన్న వ్యక్తి చైనా దేశానికి అనుకూలమైన వారు అని కూడా భారత్ హసీనాను అలెర్ట్ చేసింది అని అంటున్నారు.

అందువల్ల ఆయనతో జాగ్రత్తగా ఉండాలని భారత జాతీయ భద్రతా దళ అధికారులు హసీనాను హెచ్చరించారని అంటున్నారు. అయినా షేక్ హసీనా ఆయనను నమ్మారు. ఆయనను ఆర్మీ చీఫ్ గా నియమించి చివరికి తన పదవికీ తన ప్రతిష్టకు ఎసరు తెచ్చుకున్నారని అలాగే బంగ్లాదేశ్ లో ప్రజా ప్రభుత్వం కుప్పకూలడానికి కూడా ఆయన నియామకమే కారణం అయింది అని అంటున్నారు.

బంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతూంటే ఆర్మీ వాటిని అణచవేయగలిగి కూడా చాలా చోట్ల చేష్టలుడిగి చూసిందని అంటున్నారు. అంతే కాదు ఆందోళనకారులకు అండదండలు అందించారు అని అంటున్నారు. పెద్ద ఎత్తున ఎగిసిపడిన ఎన్నో ఉద్యమాలను ఆర్మీ అణచివేసింది. కానీ బంగ్లాదేశ్ లో మాత్రం ఒక పద్ధతి ప్రకారం ఉద్యమాలు జరిగాయని వాటిని ఆర్మీ వెనక ఉండి ఎగదోసింది అని అంటున్నారు.

జమాన్ విషయంలో మరో అనుమానం ఏంటి అంటే ఆయన షేక్ హసీనా దేశం విడిచి పోగానే మొత్తం దేశాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అంతే కాదు షేక్ హసీనాకు ఆమె పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి బయటకు రప్పించారు. ఈ మేరకు దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ఆదేశాలు జారీ చేసేలా చూసారని అంటున్నారు.

పక్కా ప్లాన్ తోనే షేక్ హసీనా మీద కుట్ర జరిగింది అని అంటున్నారు. ఇక జమాన్ విషయం తీసుకుంటే ఆయన షేక్ హసీనాకు వరసకు బంధువు కూడా అవుతారుట. బంగ్లాదేశ్ మాజీ సైన్యాధిపతి ముస్తఫిజూర్ రహమాన్ కుమార్తెని వివాహం చేసుకున్నారు. షేక్ హసీనాను ఈ ముసఫిజూర్ రహమాన్ మామయ్య వరస అవుతారు. ఇలా దగ్గర బంధుత్వం ఉండడం వల్లనే జమాన్ ని ఆర్మీ చీఫ్ గా చేయలని షేక్ హసీనా చూసారు.

కానీ ఆమె అనుకున్నది వేరేగా అయింది. ఇక ఈ జమాన్ విషయానికి వస్తే ఆయన మిలటరీ జీవితానికి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. బంగ్లా ఆర్మీని పూర్తి స్థాయిలో ఆధునీకరించిన అధికారిగా ఆయనకు పేరుంది. అందుకే ఆయనకు ఆర్మీ చీఫ్ పదవిని కట్టబెట్టారు.