Begin typing your search above and press return to search.

బీజేపీ గెలిస్తే ఏక్ నాధ్ మాజీ కావాల్సిందేనా ?

మహారాష్ట్రలో బీజేపీ కూటమిలో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల చీలిక నేతలు వారి అనుచర వర్గం ఉన్నాయి.

By:  Tupaki Desk   |   21 Oct 2024 6:30 AM GMT
బీజేపీ గెలిస్తే  ఏక్ నాధ్  మాజీ కావాల్సిందేనా ?
X

మహారాష్ట్రలో బీజేపీ కూటమిలో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల చీలిక నేతలు వారి అనుచర వర్గం ఉన్నాయి. శివసేన చీలిక నేత ఏక్ నాధ్ షిండేని సీఎం గా చేసి రెండేళ్ళుగా బీజేపీ మహా రాజకీయం ఏంటో చూపిస్తోంది. ఆయన ఒక్కరే చాలరు అన్నట్లుగా శరద్ పవార్ ఎన్సీపీ ని చీల్చి ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ ని కూడా తెచ్చి డిప్యూటీ సీఎం ని చేసింది.

ఇక మొదట్లో సీఎం అయ్యారు. అంతకు ముందు 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ల పాటు సీఎం గా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ని కూడా ఉప ముఖ్యమంత్రిని చేసింది బీజెపీ అధినాయకత్వం.

ఇక ఒకసారి ఫుల్ టైం సీఎం గా చేసి రెండోసారి కూడా కొన్ని రోజులు సీఎం గా చేసి చివరికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులలో ఒకరుగా సర్దుకోవడం దేవేంద్ర ఫడ్నవీస్ కి ఎంతవరకూ ఆమోదమో ఎవరికీ తెలియదు. అయితే అధినాయకత్వం మాట మేరకు కట్టుబడి ఆయన గడచిన రెండేళ్లుగా బండి లాక్కొచ్చారు.

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి తక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి. దానికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తాను అని ఫడ్నవీస్ అన్నట్లుగా కూడా ప్రచారం అయితే సాగింది. అయితే ఆ తరువాత ఆయనను సముదాయించారు అని కూడా చెప్పుకున్నారు. మరి లోక్ సభ సీట్లు తక్కువ వచ్చాయనా లేక వేరే అసంతృప్తితోనా ఫడ్నవీస్ ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారో తెలియదు అని అంటున్నారు

ఇక ఇపుడు మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. ఇటువంటి కీలక సమయంలో ఫడ్నవీస్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడని భావించారు అని అంటున్నారు. అయితే బీజేపీ అధినాయకత్వం నచ్చచెప్పి ఆయనను పోటీకి సిద్ధపరుస్తోందని అంటున్నారు.

ఇవన్నీ చూసినపుడు దేవేంద్ర ఫడ్నవీస్ అధినాయకత్వం విధానాల వల్ల కొంత విసిగి ఉన్నారనే అంటున్నారు. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా తాను సీఎం గా అయిదేళ్లు పనిచేసినా తనను పక్కన పెట్టి ఏక్ నాధ్ షిండేను సీఎం చేయడం అయితే ఆయనకు నచ్చినట్లుగా లేదని అంటున్నారు.

ఇక షిండే వైఖరి చూస్తే ఆయన కూడా కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన దూకుడు రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కాంట్ బట్ అన్నట్లుగానే ఈ పొత్తులను భరిస్తోంది అనీ అంటున్నారు. మరో వైపు చూస్తే మొత్తం 288 సీట్లు కలిగిన మహారాష్ట్రలో బీజేపీ 150 కి తగ్గకుండా సీట్లు తీసుకోవాలని ఆ మిగిలిన 138 సీట్లలోనే మిత్రులకు పంచాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

అంటే రేపటి రోజున ఎటు నుంచి ఎటు ఎలా ఉన్నా మెజారిటీ ఫిగర్ అయిన 145 సీట్లకు కొన్ని తగ్గినా భర్తీ చేసుకుని ఏదో విధంగా బీజేపీ సీఎం నే ఈసారి ప్రతిష్టించాలని చూస్తోంది అని అంటున్నారు. దానికి తగినట్లుగా దేవేంద్ర ఫడ్నవీస్ ని తెచ్చి పోటీకి దించడం చూస్తే అదే నిజం అని అంటున్నారు.

అంటే మిత్రులతో కలసి పోటీ చేయడం అయినా సరే బీజేపీ మాత్రం ఈసారి సీఎం కుర్చీకే గురి పెట్టిందని అంటున్నారు. ఆ విధంగా నచ్చచెప్పే ఫడ్నవీస్ ని పోటీ చేయిస్తోంది అని అంటున్నారు. ఇవన్నీ చూసినపుడు బీజేపీ కూటమి గెలిస్తే ఏక్ నాధ్ షిండే మాజీ సీఎం అవుతారా అన్న చర్చ అపుడే మొదలైంది. మరి అదే కూటమిలో కనుక గట్టిగా డిస్కషన్ అయితే మాత్రం బీజేపీ విజయావకాశాల మీదనే తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏక్ నాధ్ షిండే వ్యూహాలు ఎలా ఉంటాయో అన్నది అని అంటున్నారు.