Begin typing your search above and press return to search.

బీజేపీకి దెబ్బేయనున్న ఆ రెండు రాష్ట్రాలు....!?

బీహార్ లో 2019లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి 16 నుంచి 18 దాకా సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 3:46 AM GMT
బీజేపీకి దెబ్బేయనున్న ఆ రెండు రాష్ట్రాలు....!?
X

బీజేపీ ముచ్చటగా మూడవసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తోంది. దానికి తగినట్లుగా హుషార్ క్యాడర్ లో పెంచేందుకు మోడీ అమిత్ షా ద్వయం చేయాల్సినవి అన్నీ చేస్తున్నారు. సెమీ ఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడింటిని గెలుచుకుని లోక్ సభ ఎన్నికల్లో తమదే విజయం అని సంకేతాలు ఇచ్చింది.

అయితే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గతంలో గెలిచినన్ని సీట్లు ఈసారి గెలవడం సాధ్యమేనా 2019 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా అంటే డౌటే అన్నట్లుగా సర్వే నివేదికలు కొన్ని సూచిస్తున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన సీ ఓటర్ ఏబీపీ సర్వే ప్రకారం చూస్తే బీజేపీని రెండు పెద్ద రాష్ట్రాలు భారీగా దెబ్బ తీస్తున్నాయని అంటున్నారు.

బీహార్ లో 2019లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి 16 నుంచి 18 దాకా సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. ఇండియా కూటమికి అక్కడ 22 నుంచి 23 సీట్ల దాకా వస్తాయని తేలింది. అలాగే మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లు ఉంటే శివసేనతో కలిపి బీజేపీ 2019లో అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ సాధ్యపడక పోవచ్చు అని ఈ సర్వే నివేదిక చెబుతోంది. ఈసారి బీజేపీకి 19 నుంచి 21 మధ్యలో సీట్లు వస్తాయని ఇండియా కూటమికి 26 నుంచి 28 దాకా వస్తాయని లెక్క తేల్చింది.

ఇక పశ్చిమ బెంగాల్ లో చూస్తే 2019లో అనూహ్యంగా బీజేపీకి ఎంపీ సీట్లు పెరిగాయి. మొత్తం 42 సీట్లకు గానూ మెజారిటీ సీట్లను అప్పట్లో బీజేపీ గెలుచుకుంది. ఈసారి మాత్రం తృణమూల్ కాంగ్రెస్ పుంజుకుంది. ఆ పార్టీకి పాతిక సీట్ల దాకా రావచ్చు అని సర్వే చెబుతోంది. బీజేపీకి 16 దాకా సీట్లు వస్తాయని పేర్కొంది.

ఇక గతంలో పంజాబ్ లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్ కి ఆ సీట్లు టర్న్ అయ్యేలా ఉన్నాయి. ఇలా లెక్క వేసుకుంటే బీజేపీకి ఓవరాల్ గా యాభై దాకా ఎంపీ సీట్లు ఈ రాష్ట్రాలలో తగ్గిపోనున్నాయని అంటున్నారు.

అంటే గతంలో వచ్చిన 303లో 50 సీట్లు పోతే 250 నుంచి 260 మధ్యన బీజేపీ నంబర్ ఉండబోతోందా అన్న చర్చ మొదలైంది. మరి అధికారానికి ఎన్డీయే మిత్రులతో కలసి బీజేపీ రావచ్చేమో. కానీ సొంతంగా బీజేపీకి మెజారిటీ దక్కే సూచనలు లేవా అంటే సీ ఓటర్ ఏబీపీ సర్వే మాత్రం రెండు పెద్ద రాష్ట్రాలు గట్టిగా దెబ్బ వేయబోతున్నాయని చెబుతోంది. దీనికి తగిన విధంగా బీజేపీ ఆపరేషన్ ఉంటే మాత్రం ఈసారి కూడా సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.