Begin typing your search above and press return to search.

సింగర్ మనో కొడుకుల రచ్చ!?

By:  Tupaki Desk   |   12 Sep 2024 4:49 AM GMT
సింగర్ మనో కొడుకుల రచ్చ!?
X

వివాదాలకు దూరంగా ఉండే ప్రముఖుల్లో ప్రముఖ సింగర్ మనో ఒకరుగా చెప్పొచ్చు. పెదాలపై చెరగని చిరునవ్వుతో వ్యవహరించే ఆయన స్నేహపూర్వక తీరు అందరిని ఆకర్షించేలా ఉంటుంది. అలాంటి ఆయన ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఆయన పుత్రరత్నాలు వ్యవహరించారు. పూటుగా తాగేసి నానా రచ్చ చేయటమే కాదు.. దాడి చేసి పారిపోయిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరి ఘనకార్యంపై పోలీసులు కేసు నమోదు చేసి.. వారి కోసం వెతుకుతున్నారు.

చెన్నై ఆలప్పాక్కానికి చెందిన క్రపాకరన్.. మరోమైనర్ బాలుడు శ్రీదేవి కుప్పంలోని పుట్ బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఎప్పటిలానే వారి ట్రైనింగ్ ముగిసిన తర్వాత.. దగ్గర్లో ఉన్న హోటల్ కు తినేందుకు వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడికి మనో కుమారుడుతో సహా ఐదుగురు మద్యం మత్తులో అక్కడకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా క్రపాకరన్.. మైనర్ బాలుడితో గొడవకు దిగారు. తాగిన మైకంలో ఉన్న వారు చెలరేగిపోయి.. ఇద్దరిపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో.. గాయపడిన క్రపాకరన్ ను దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఉదంతంపై పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఫిర్యాదు చేశారు. ఈ దాడి ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించారు.

దాడి చేసిన వారిలో సింగర్ మనో కొడుకులు రఫిక్.. సాహీర్ తో పాటు వారి స్నేహితులు మరో ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు. మనో కుమారులుఇద్దరు.. మరొకరు మాత్రం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వైనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.