Begin typing your search above and press return to search.

గేమింగ్, బెట్టింగ్ లపై రాష్ట్రాలకు మరింత బలమిచ్చిన కేంద్రం

అయితే, వీటి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   27 March 2025 12:30 AM
States has full permissions to betting apps
X

గేమింగ్‌ ,ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ విషయాలపై చట్టాలు రూపొందించే అధికారం పూర్తిగా రాష్ట్రాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అంశాలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆయన తెలిపారు. అయితే, వీటి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిన నేపథ్యంలో కేంద్రం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటుందా అని మారన్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా వైష్ణవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. గేమింగ్‌ , బెట్టింగ్‌పై చట్టాలు చేసేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా పూర్తి అధికారం ఉందని ఆయన గుర్తు చేశారు. సమాఖ్య వ్యవస్థను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. అయితే, రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ, తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఇప్పటికే 1410 గేమింగ్ వెబ్‌సైట్లను నిషేధించామని మంత్రి వైష్ణవ్ తెలిపారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్) అక్రమంగా నిర్వహిస్తున్న వందల వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. అంతేకాకుండా ఈ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి, రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది.

ఈ సందర్భంగా డీజీజీఐ ప్రజలను అప్రమత్తం చేసింది. ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఎవరూ ఉపయోగించవద్దని హెచ్చరించింది. ఈ సంస్థలు నమోదు చేసుకోకుండా, ఆదాయాలను దాచిపెట్టి జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నాయని కేంద్రం తెలిపింది. ఐటీ శాఖ సమన్వయంతో ఈ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసినట్లు పేర్కొంది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు వంటి ప్రముఖులు ఈ గేమింగ్ సంస్థల ప్రచారంలో పాల్గొంటున్నారని గుర్తించామని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, ఈ ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉండాలని సూచించింది. ఇవి వ్యక్తుల ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా, దేశ భద్రతను దెబ్బతీసే కార్యకలాపాలకు పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ స్పష్టీకరణ , చర్యలు గేమింగ్ - ఆన్‌లైన్ బెట్టింగ్ పరిశ్రమపై ఒక ముఖ్యమైన ప్రభావాన్ని చూపనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో చట్టాలు రూపొందించడానికి మరింత చురుకుగా వ్యవహరించే అవకాశం ఉంది. అదే సమయంలో అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్రం యొక్క నిఘా , చర్యలు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.