Begin typing your search above and press return to search.

మంత్రులకు ర్యాంకులు.. ఎక్స్ లో చంద్రబాబు ట్వీట్

మంత్రులకు ర్యాంకులివ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా గురువారం మంత్రులు పనితీరుపై ఓ రిపోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Feb 2025 11:08 AM GMT
మంత్రులకు ర్యాంకులు.. ఎక్స్ లో చంద్రబాబు ట్వీట్
X

మంత్రులకు ర్యాంకులివ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా గురువారం మంత్రులు పనితీరుపై ఓ రిపోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రులకు ర్యాంకులిచ్చారు. మిగతా మంత్రులతోపాటు చంద్రబాబుకూ ఓ ర్యాంకు ఇచ్చారు. దీనిపై పార్టీలో చర్చ జరుగుతుండటంతో ఈ రోజు ఎక్స్ లో ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో తమ పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు అంటూ ఎక్స్ లో ముఖ్యమంత్రి రాసుకొచ్చారు.

‘‘ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే...మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నాం. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రభుత్వ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. టీమ్ వర్క్‌ చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగం, అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప రాష్ట్ర పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనిచేయాలన్నదే మా ఆలోచన. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే మంత్రులకు ర్యాంకులివ్వడమని వివరించారు.

ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో నేను, నా కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నాము. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాము. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి... సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను అంటూ సీఎం పోస్టు చేశారు.