Begin typing your search above and press return to search.

లడ్డూ ఎదురుదెబ్బను బాబు ముందే ఊహించారా?

అయినప్పటికీ.. హిందువుల భావోద్వేగ అంశం కావటం.. పెద్ద ఎత్తున ప్రముఖులు.. సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరుగా స్పందిస్తున్న నేపథ్యంలో తిరుపతి లడ్డూ వివాదం కొనసాగుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 7:27 AM GMT
లడ్డూ ఎదురుదెబ్బను బాబు ముందే ఊహించారా?
X

కొన్ని విషయాల్లో కొందరి తీరు ఒకలా ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే.. ఆ తేడాను ఇట్టే పట్టేయొచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా అలానే గుర్తించి.. ఆయన్ను ఆత్మరక్షణలో పడేలా చేయటమే కాదు తాజాగా సుప్రీంకోర్టు తలంటు అంటేలా వైసీపీ వ్యవహరించిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే మొదలుపెట్టినా.. ఆయన కూడా ఊహించని రీతిలో ఆ అంశానికి ప్రాధాన్యత లభించటం.. మీడియా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ కావటం తెలిసిందే.

నిజానికి లడ్డూ ఉదంతాన్ని చూస్తే చంద్రబాబు మాట వరసకు అన్న మాటను.. అక్కడితో వదిలేస్తే సరిపోయేది. దాన్ని అందిపుచ్చుకున్న తెలుగుదేశం దూకుడుగా వెళ్లింది. ఎలాంటి కసరత్తు లేకుండా.. మరెలాంటి బ్యాకప్ ప్లాన్ లేకుండా.. అధినేత చంద్రబాబు మీద నమ్మకంతో చెలరేగిపోయిన తమ్ముళ్ల పుణ్యమా అని.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తల పట్టుకునే పరిస్థితి. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదాన్ని ఒక దశ వరకు మాత్రమే చంద్రబాబు మాట్లాడటం ఉంటుంది.

ఎప్పుడైతే జనసేనాని పవన్ కల్యాణ్ లడ్డూ ఎపిసోడ్ ను టేకప్ చేశారో.. ఆ తర్వాత నుంచి చంద్రబాబు ఆ అంశం మీద మాట్లాడటం మానేశారు. ఎందుకిలా? అంటే.. తాను ప్రస్తావించిన అంశంపై తమ వద్ద బలమైన ఆధారాలు.. తప్పు జరిగిందన్న విషయాన్ని నిరూపించేంత సీన్ లేకపోవటంతో.. తెలివి తెచ్చుకున్న చంద్రబాబు దాని కాడిని అక్కడే వదిలేశారు.

అయినప్పటికీ.. హిందువుల భావోద్వేగ అంశం కావటం.. పెద్ద ఎత్తున ప్రముఖులు.. సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరుగా స్పందిస్తున్న నేపథ్యంలో తిరుపతి లడ్డూ వివాదం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు మాట్లాడటం మానేశారో.. అప్పటి నుంచి వైసీపీ నేతలు మరింత సీరియస్ గా ఈ ఇష్యూను టేకప్ చేశారని చెప్పాలి. సుప్రీంకోర్టును ఆశ్రయించే వేళలో పక్కాగా సమాచారాన్ని సేకరించటమే కాదు.. ఆసక్తికర వాదనను సిద్ధం చేసుకున్నట్లుగా చెప్పాలి. ఇందుకు తగ్గట్లే సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.. మొత్తంగా లడ్డూ వివాదాన్ని తెర మీదకు తెచ్చిన చంద్రబాబు.. దాంతో తమకు డ్యామేజే అన్న విషయాన్ని అందరి కంటే ముందే గుర్తించి.. మౌనంగా ఉన్నరన్న వాదన వినిపిస్తోంది. చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం ఎదురుచూసే కన్నా.. చంద్రబాబు లాంటి సీనియర్ అధినేత కూడా ముందుగానే ముప్పును గుర్తించాల్సి ఉందనన అభిప్రాయం వ్యక్తమవుతోంది.