Begin typing your search above and press return to search.

మన్యంలో అయ్యన్న రాజేసిన మంట... అలా అర్పుతున్న చంద్రబాబు!

ఈ సమయంలో చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా... "గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం... 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు" అని ఓ పోస్ట్ పెట్టారు.

By:  Tupaki Desk   |   11 Feb 2025 9:54 AM GMT
మన్యంలో అయ్యన్న రాజేసిన మంట... అలా అర్పుతున్న చంద్రబాబు!
X

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48 గంటల నిరవధిక బంద్ మంగళవారం తెల్లవారుజాము నుంచే మొదలైంది. ఇందులో భాగంగా.. పలు ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు ఈ మేరకు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ బంద్ నేపథ్యంలో పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి.

మరోపక్క ఈ బంధ్ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తో ఈ బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.

అవును... 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తో ఏజెన్సీలో బంద్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ బంద్ రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమయంలో చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా... "గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం... 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు" అని ఓ పోస్ట్ పెట్టారు.

ఈ సందర్భంగా... గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నాము అని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు... అందుకోసమే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు.

అందుకోసమే.. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని.. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని.. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామని తెలిపారు.

అయితే... గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయ్యిందని.. దాని పునరుద్ధరణకు తాము కృషి చేస్తామని.. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

అటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నట్లు చెప్పిన చంద్రబాబు.. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో మాట్లాడిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పలు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఏజెన్సీ ప్రాంతల్లో పర్యాటాభివృద్ధికి 1/70 చట్టంలో సడలింపులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దీంతో.. గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.