స్టైల్ మార్చిన చంద్రబాబు.. ఒప్పించి.. మెప్పిస్తున్న అధినేత
ఏపీ సీఎం చంద్రబాబు స్టైల్ మార్చారు. రాజకీయంగా తాను తీసుకుంటున్న నిర్ణయాలకు క్యాడర్ ఆమోదం లభించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
By: Tupaki Desk | 20 Feb 2025 4:30 PM GMTఏపీ సీఎం చంద్రబాబు స్టైల్ మార్చారు. రాజకీయంగా తాను తీసుకుంటున్న నిర్ణయాలకు క్యాడర్ ఆమోదం లభించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గతంలో సర్వేలు, ప్రత్యేక ప్రతినిధుల నివేదికలు అంటూ తన నిర్ణయాలను క్యాడర్ పై బలవంతంగా రుద్దిన చంద్రబాబు.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తన నిర్ణయాన్ని క్యాడర్ వ్యతిరేకిస్తే.. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుంటున్నారు. క్యాడర్ మాటకు విలువనిస్తూ వారిని ఒప్పంచి, మెప్పించి తగిన నిర్ణయం తీసుకుంటున్నారు. దీనికి ఇటీవల జరిగిన ఓ సంఘటనే ఉదాహరణగా చెబుతున్నారు. ఏలూరుకు చెందిన వైసీపీ మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికను అక్కడి క్యాడర్ వ్యతిరేకిస్తే.. వారిని ఒప్పించేందుకు సుమారు 4 నెలల పాటు ప్రయత్నించిన సీఎం చంద్రబాబు.. చివరికి వారి ఆమోదంతోనే ఆళ్లను సైకిల్ ఎక్కించారని చెబుతున్నారు.
సీనియర్ నేత, మాజీ మంత్రి ఆళ్లనాని నాలుగైదు నెలల కిందే టీడీపీలో చేరాల్సి ఉంది. కానీ ఏలూరులోని స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ఆయన చేరిక ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆళ్లనాని సైకిల్ ఎక్కారు. ఆయన చేరిక కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు ఆళ్లనాని చేరికను తీవ్రంగా అపోజ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అందుకే మొన్నటి వరకు ఆళ్లనాని జాయినింగ్ను పెండింగ్లో పెట్టారంటారు. ఫైనల్గా వ్యతిరేకించిన నేతలందరినీ ఒప్పించి..వాళ్ల సమక్షంలోనే ఆళ్లనానికి టీడీపీ కండువా కప్పారు సీఎం చంద్రబాబు. అంతేకాదు వల్లభనేని వంశీ అరెస్ట్ అంటూ హడావుడి నడుస్తున్న టైమ్లో..మూమెంట్ చూసి మరీ ఆళ్లనానిని చేర్చుకున్నారు.
ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటికే ఖాళీ అయిందని చెబుతున్నారు. ఒకప్పుడు నానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారంతా ఇప్పటికే టీడీపీలో చేరారు. ఎంఆర్డీ బలరాం దంపతులు, బొద్దాని శ్రీనివాస్, మేయర్ నూర్జహాన్ పెదబాబుతోపాటు మరికొందరు కార్పొరేటర్లు చాలా రోజుల క్రితమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లోనే ఆళ్లనాని కూడా టీడీపీలో చేరాలని భావించగా నియోజకవర్గ టీడీపీ శ్రేణులు వ్యతిరేకించి నిరసనలు తెలిపారు. ఆళ్లనానిని పార్టీలో చేర్చుకోవడం స్థానిక ఎమ్మెల్యే చంటికి కూడా ఇష్టం లేక పోయినా అధిష్టానం బుజ్జగించి మరీ అంతా సెట్రైట్ చేశాకే చేర్చుకుందని టాక్ నడుస్తోంది. నానిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది.
చేరికల వెనుక చంద్రబాబు మార్క్ వ్యూహం ఉందట. రెండు, మూడు రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీలో బలమైన నాయకులు లేకుండా చేయాలనే వ్యూహం ఒకటైతే.. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో పెరగనున్న అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను సిద్ధం చేయడం మరొక ప్లాన్గా చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో మరో 50 నియోజకవర్గాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంటే 225 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను తయారు చేయాలన్న మాట. అందుకే సొంత పార్టీ నేతలు వ్యతిరేకించినా..బుజ్జగించి మరీ..వైసీపీ నేతలను చేర్చుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకొంత మంది నేతలను కూడా త్వరలోనే చేర్చుకుంటారని అంటున్నారు.
చంద్రబాబు వ్యూహం ఫలిస్తే వైసీపీకి, జగన్కు సవాళ్లు ఎదురవడం పక్కా అన్న చర్చ జరుగుతోంది. వైసీపీలో ఎవరికీ గట్టి పట్టు లేకుండా చేయడంతో పాటు, ఆ పార్టీని పూర్తిగా వీక్ చేసేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారని అంటున్నారు. వైసీపీని మరింత బలహీన పర్చడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని చంద్రబాబు వ్యూహమట. అయితే ఆళ్లనాని జాయినింగ్తో..టీడీపీలో చేరాలనుకుంటున్న మిగతా నేతల ఆశలు కూడా చిగురిస్తున్నాయట. తమ చేరికకు కూడా టీడీపీ అధిష్టానం త్వరలోనే గ్నీన్సిగ్నల్ ఇస్తుందని ఎదురు చూస్తున్నారట. రాబోయే రోజుల్లో ఇంకెవరెవరు నేతలు టీడీపీ గూటికి చేరుతారో చూడాలి మరి.