Begin typing your search above and press return to search.

1983 నుంచి వస్తున్న ఆచారాన్ని బాబు పాటించలేదా ?

ఆ ఆచారం తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ. 2009కి ముందు 21 దాకా ఉండేవి.

By:  Tupaki Desk   |   13 Jun 2024 2:45 AM GMT
1983 నుంచి వస్తున్న ఆచారాన్ని బాబు పాటించలేదా ?
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి మంత్రివర్గ కూర్పులో నాలుగు దశాబ్దాలుగా వస్తున్న ఒక ఆచారాన్ని పాటించలేదని అంటున్నారు. ఇంతకీ ఏమా ఆచారం, చంద్రబాబు చేసిన అపచారం ఏమిటి అని చర్చ అయితే సాగుతోంది.

ఆ ఆచారం తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ. 2009కి ముందు 21 దాకా ఉండేవి. ఆ తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా అవి కాస్తా 19 అయ్యాయి. అయినా ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న ఉమ్మడి జిల్లా ఇదే కావడం విశేషం.

ఇకపోతే ఈ జిల్లాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడం వారు అంతా ప్రతీ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లూ ఒకే పార్టీకి గుత్తమొత్తంగా అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. అలా గెలిచిన పార్టీ తిరిగి ఆ జిల్లా రుణం తీర్చుకోవడానికి మంత్రి పదవులు బోలెడు కట్టబెడుతూ వస్తోంది.

కనీసంగా నాలుగు మంత్రి పదవులు ఎపుడూ తగ్గకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు ఇవ్వడం ఒక ఆచారంగా వస్తోంది. అది ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చింది. కానీ మొట్టమొదటిసారి చంద్రబాబు ఉమ్మడి గోదావరి జిల్లాకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చారు. అందులో రెండు జనసేనకు ఒకటి టీడీపీకి దక్కాయి.

అలా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ మంత్రులు అయ్యారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నాలుగు మంత్రి పదవులు ఖాయంగా ఈ జిల్లాకు దక్కేవి, ఈసారి క్లీన్ స్వీప్ చేస్తూ మొత్తానికి మొత్తం కూటమికే ఈ జిల్లా అప్పగించింది. అయినా నాలుగు మంత్రి పదవులు ఇచ్చే సంప్రదాయాన్ని ఎందుకు పక్కన పెట్టారు అన్న చర్చ అయితే సాగుతోంది.

ఈ విషయంలో బాబు ఆలోచనలు ఏమైనా మారాయా లేక సమీకరణల ఒత్తిడి వల్ల ఆయన కోత విధించారా అన్న చర్చ అయితే సాగుతోంది.ఏది ఏమైనా మొత్తం 19 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నుంచి ఒకే ఒక మంత్రి ఉండడం మాత్రం విశేషం.

ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ, పినిపె విశ్వరూప్ తానేటి వనిత మంత్రులుగా ఉండేవారు. అంతకు ముందు చంద్రబాబు హయాంలోనూ నలుగురు మంత్రులను ఈ జిల్లా చూసింది. మరి చంద్రబాబు ఎందుకో కోత పెట్టారని చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.