Begin typing your search above and press return to search.

ఓ రేంజులో చంద్రబాబు మాస్‌ ర్యాగింగ్‌!

తాజాగా పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని, గత జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   29 Jun 2024 5:30 AM GMT
ఓ రేంజులో చంద్రబాబు మాస్‌ ర్యాగింగ్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. ఏపీ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొలి శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తన తొలి పర్యటనకు పోలవరం ప్రాజెక్టును ఎంచుకున్న సంగతి తెలిసిందే.

స్వయంగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి వచ్చారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ఇప్పట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టారు. ప్రాజెక్టు పూర్తికి కనీసం నాలుగు సీజన్లు, నాలుగేళ్ల కాలం పడుతుందని తేల్చిచెప్పారు. జగన్‌ తన అస్తవ్యస్థ విధానాలతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు.

తాజాగా పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని, గత జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి తనకేమీ తెలియదంటూ వ్యాఖ్యానించిన అంబటి రాంబాబు మాటల వీడియో క్లిప్పింగ్‌ ను చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఆయన అంబటిని ఆంబోతుగా అభివర్ణించారు. ఇలాంటి వ్యక్తులు కలిసి పోలవరాన్ని సర్వనాశనం చేశారని.. తన హయాంలో 2014 నుంచి 2019 వరకు 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. జగన్‌ తన ఐదేళ్ల పాలనలో కేవలం 4 శాతం పనులను మాత్రమే చేశారన్నారు.

కాగా గత జగన్‌ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబును విమర్శిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బస్సుల్లో మహిళలను పోలవరంకు తరలించి చంద్రబాబు భజన చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కొందరు మహిళలు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ‘జయము జయము చంద్రన్న.. జయము జయము చంద్రన్న’ పాట పాడుతూ భజన చేసిన వీడియో క్లిప్పును నాడు జగన్‌ అసెంబ్లీలో ప్రదర్శించి బాబు గాలి తీసేశారు.

ఇక ప్రస్తుతానికి వస్తే వైసీపీ ఎన్నికల్లో «ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 అసెంబ్లీ సీట్లనే గెలుచుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఏ పోలవరం ప్రాజెక్టుపై అయితే తనపై తీవ్ర విమర్శలు, సెటైర్లు చేస్తూ వైసీపీ నేతలు అవమానించారో.. ఇప్పుడు అదే అంశంతో వైఎస్‌ జగన్‌ పైన, వైసీపీ నేతలపైన చంద్రబాబు నిప్పులు కక్కుతున్నారు.

సుదీర్ఘ మీడియా సమావేశాలు, పోలవరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు ఇస్తూ చంద్రబాబు వైసీపీని ఆడుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా నాటి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును అయితే మాస్‌ ర్యాగింగ్‌ చేస్తున్నారని చెబుతున్నారు.

ఇటీవల అంబటి ప్రెస్‌ మీట్‌లో పోలవరం ప్రాజెక్ట్‌ చాలా క్లిష్టమైనదని, దాని గురించి తనకేమీ తెలియదని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పోలవరం గురించి మాట్లాడిన చంద్రబాబు.. అంబటి రాంబాబును ఎగతాళి చేశారు. పోలవరం గురించి ఏమీ తెలియని అంబటిలాంటి వ్యక్తిని జగన్‌ మంత్రిగా నియమించాడంటూ మండిపడ్డారు. అది కూడా నవ్వుతూ, ఎగతాళి చేస్తూ సెటైర్లు వేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.