Begin typing your search above and press return to search.

ఆ మంత్రికి చంద్రబాబు హెచ్చరిక

అయితే, తాజాగా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి సతీమణి హరిత...ఓ పోలీసు అధికారిపై అధికారం చలాయించిన వీడియో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   1 July 2024 5:00 PM GMT
ఆ మంత్రికి చంద్రబాబు హెచ్చరిక
X

ఏపీలో గత ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయని ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రజల వరకు అంతా విమర్శించిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మొదలు గల్లీలో అనుచరుల వరకు దబాయింపులు, బెదిరింపులు, రౌడీయిజం, సెటిల్మెంట్లు వంటి చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు నేపథ్యంలో వైసీపీ ఓటమి పాలైందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. కట్ చేస్తే, ఏపీలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని, గతంలో వైసీపీ నేతల మాదిరిగా తమ పార్టీ ఎమ్మెల్యేలు చేయరని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే, తాజాగా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి సతీమణి హరిత...ఓ పోలీసు అధికారిపై అధికారం చలాయించిన వీడియో వైరల్ గా మారింది.

మామూలుగా వైసీపీ హయాంలో అయితే ఈ వ్యవహారంపై ఎటువంటి చర్యలు ఉండేవి కాదు. కానీ, ఇది ప్రజా పాలన అని చెప్పిన చంద్రబాబు..దానికి తగ్గట్లే ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే స్పందించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారితో హరిత ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, స్వయంగా మంత్రి రాం ప్రసాద్ రెడ్డితో చంద్రబాబు ఫోన్ లో ఆ విషయంపై మాట్లాడారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంతో వ్యవహరించాలని హితవు పలికారు. ఇటువంటి వైఖరిని ఏమాత్రం సహించబోనని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

దీంతో, జగన్ పాలనకు..చంద్రబాబు పాలనకు ఉన్న తేడా ఇదేనని సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రశంసలు కురుస్తున్నాయి. జగన్ హయాంలో తన డ్రైవర్ ను చంపి అతడి ఇంటికే డోర్ డెలివరీ చేసిన మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు పక్కన నిలబడి జగన్ నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారని, కానీ, పోలీసు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన మంత్రి భార్య ఉదంతంపై చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయి గట్టి సంకేతాలిచ్చారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.