Begin typing your search above and press return to search.

హాట్‌ టాపిక్‌.. ట్రంప్‌ పై బుల్లెట్‌.. జగన్‌ పై గులకరాయి!

ఈ మేరకు ఎక్స్‌ లో సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఒక పోస్టు పెట్టారు.

By:  Tupaki Desk   |   15 July 2024 7:44 AM GMT
హాట్‌ టాపిక్‌.. ట్రంప్‌ పై బుల్లెట్‌.. జగన్‌ పై గులకరాయి!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చెవికి గాయంతో బయటపడ్డారు.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిపై హత్యాయత్నానికి, ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పై గులకరాయి దాడికి లింకు పెడుతూ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సెటైర్లు పేల్చారు.

ఈ మేరకు ఎక్స్‌ లో సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఒక పోస్టు పెట్టారు. ఇందులో ట్రంప్, వైఎస్‌ జగన్‌ చిత్రాలను ఆయన పోస్టు చేశారు. ఇందులో ట్రంప్‌ రక్తం కారుతూ ఉన్నా పిడికిలి బిగించి ఉన్నారు. మరోవైపు జగన్‌ నుదిటిన ప్లాస్టర్‌ వేసుకుని దీనవదనంతో ఉన్నారు. ఈ ఫొటోలకు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి క్యాప్షన్‌ ను కూడా జోడించారు. ‘బుల్లెట్‌ తగిలితే పౌరుష సింహనాదం – నాయకత్వ లక్షణం, గులకరాయికే ప్రాణభయం – పిరికిపంద తత్వం’ అంటూ జగన్‌ వ్యవహార శైలిపై సెటైర్లు వేశారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విజయవాడలో ప్రచారం నిర్వహిస్తున్న నాటి సీఎం వైఎస్‌ జగన్‌ పై ఒక వ్యక్తి గులకరాయి విసిరాడు. దీనిపై విజయవాడ పోలీసులు హత్యాయత్నం కింద నిందితుడిపై కేసు పెట్టారు. నిందితుడు టీడీపీ కార్యకర్త అని, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరుడిని వైసీపీ అప్పట్లో ప్రచారం చేసింది. కాగా ఈ గులకరాయి దాడి ఘటనను హత్యాయత్నం అని చెప్పుకోవడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని వైసీపీ భావించిందనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టే వైఎస్‌ జగన్‌ తన నుదిటిన పెద్ద ప్లాస్టర్‌ వేసుకుని చాలా రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇక మాజీ మంత్రి, నాటి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అయితే కంటికి దెబ్బ తగిలిందని కన్ను మొత్తం మూసేస్తూ పెద్ద కట్టుతోనే చాలా రోజులు కనిపించారు. ఏదేమైనా ఈ సానుభూతి కలసి రాకపోవడంతో వైసీపీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయింది. వెలంపల్లి శ్రీనివాసరావు కూడా చిత్తుగా ఓడారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ పై జరిగిన హత్యాయత్నాన్ని, జగన్‌ పై గులకరాయి ఘటనను పోలుస్తూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సెటైర్లు వేశారు. ట్రంప్‌ కు బుల్లెట్‌ తగిలినా పౌరుషంతో సింహంలాగా నినాదం చేశారని, అదే వైఎస్‌ జగన్‌ గులకరాయి తగిలితే ప్రాణభయం చూపారని.. ఇది పిరికిపంద లక్షణమని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌ లో పోస్టు చేశారు. దీంతో సోమిరెడ్డి పోస్టుకు అనుకూలంగా, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.