Begin typing your search above and press return to search.

భారీ ఎత్తున పీసీసీ చీఫ్ ల మార్పు...షర్మిల పరిస్థితి ఏంటి?

దేశంలో దాదాపుగా ఎనిమిది నుంచి పది రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న పీసీసీ చీఫ్ లను మార్చాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:02 AM GMT
భారీ ఎత్తున పీసీసీ చీఫ్ ల మార్పు...షర్మిల పరిస్థితి ఏంటి?
X

దేశంలో దాదాపుగా ఎనిమిది నుంచి పది రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న పీసీసీ చీఫ్ లను మార్చాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. దీని కోసం ఈ నెల 13న ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ అత్యున్నత స్థాయి పార్టీ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటు ఆయా రాష్ట్రాల ఇంచార్జిలు ఏఐసీసీ జనరల్ సెక్రటరీస్, సెక్రటరీస్ ఇతర ఉన్నత స్థాయి పార్టీ నేతలు హాజరవుతారు అని అంటున్నారు.

ఈసారి జరిగేది కాంగ్రెస్ మెగా మీటింగ్ అని అంటున్నారు. అనేక కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకుంటారు అని అంటున్నారు. మరికొద్ది నెలలలో దేశంలో జార్ఖండ్ మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అలాగే వచ్చే ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే మరి కొన్ని రాష్ట్రాలలో పీసీసీ చీఫ్ లను మార్చాల్సి ఉంది. ఒడిషా తెలంగాణా వంటి చోట్ల కొత్త నాయకత్వాన్ని తెస్తారు. దాంతో ఈసారి మీటింగ్ లో సంచలన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. దేశంలో మరింతగా బలం పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తొంది. అదే సమయంలో కాంగ్రెస్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో సాధించిన సీట్లూ ఓట్ల పైన సమీక్ష చేయడం వంటివి చేస్తారు అని అంటున్నారు.

ఈ సమావేశాలలోనే కాంగ్రెస్ ఏ రాష్ట్రాలలో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి అన్నది కూడా నిర్ణయిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి పక్షాలతో కాంగ్రెస్ కి పొత్తులు ఉన్నాయి. అలా లేని రాష్ట్రాలలో కాంగ్రెస్ అనుసరించే విధానం ఏమిటి అన్నది చూడాలి. ఉదాహరణకు ఏపీ విషయం కూడా చర్చకు రావచ్చు అని అంటున్నారు. ఏపీలో రానున్న అయిదేళ్లలో బలోపేతం కావడం పైన కూడా చర్చ సాగే అవకాశం ఉంది.

ఇక ఏపీ పీసీసీ చీఫ్ గా ఈ జనవరిలోనే షర్మిలను నియమించారు. ఆమె నాయకత్వంలో పార్టీ ఎన్నికలకు వెళ్ళింది. ఆశించిన స్థాయిలో అయితే ఫలితాలు రాలేదు. వైఎస్సార్ కార్డు కూడా పెద్దగా పని చేయలేదు అని అంటున్నారు. అయితే వైసీపీని ఓడించడానికి మాత్రం కాంగ్రెస్ ఈ ఎన్నికలు ఉపయోగించుకుంది అని మరో మాట ఉంది.

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఈ కొత్త రాజకీయ సన్నివేశంలో కాంగ్రెస్ ఏ విధంగా ఏపీలో భూమిక పోషించాలి అన్నది కూడా ఈ సమావేశాలలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఇక చూస్తే ఏపీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉన్నారు. వారిని షర్మిల కలుపుకుని పోవడం లేదని అంటున్నారు. దాంతో ఆమె తనదైన పంధాలో పార్టీని నడుపుతున్నారు. అయితే సీనియర్లు ఏ విధంగా అసంతృప్తి వ్యక్తం చేసినా షర్మిలకే హై కమాండ్ ఓటు వేస్తుందని అంటున్నారు. ఆమె పీసీసీ చీఫ్ గా ఉండడం ద్వారానే వైఎస్సార్ లెగసీఎని తమ వైపు తిప్పుకోవచ్చు అని వైసీపీని బలహీనం చేయవచ్చు అని ఒక వ్యూహం ఉంది అంటున్నారు.

అయితే ఇండియా కూటమి వైపు వైసీపీ చూస్తోంది అన్న వార్తల నేపధ్యంలో చూసినపుడు కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చుకుంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ మెగా మీట్ మీద ఏపీ కాంగ్రెస్ నేతలతో పాటు రాజకీయ పక్షాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణా విషయం తీసుకుంటే కొత్త పీసీసీ చీఫ్ ని ఖరారు చేయడం ఖాయమని అంటున్నారు.