Begin typing your search above and press return to search.

"రేవంత్ సవారీ ఆపేస్తే పులి తినేస్తుంది"!

అవును... హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ హైడ్రా హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో... ఈ కూల్చివేతల అంశాని స్వాగతిస్తున్నారు సీపీఐ నారాయణ.

By:  Tupaki Desk   |   26 Aug 2024 1:10 PM GMT
రేవంత్  సవారీ ఆపేస్తే పులి తినేస్తుంది!
X

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎఫ్.టీ.ఎల్., బఫర్ జోన్లలో నిర్మించిన భవనాలు, నిర్మాణాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు వరుసగా కూల్చివేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే శనివారం ఉదయాన్నే మాధాపూర్ లో ఉన్న సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ సెంటర్ వద్ద హైడ్రాకు చెందిన బుల్డోజర్లు దర్శనమివ్వడం.. మూడు నాలుగు గంటల్లో అవి పని పూర్తిచేశాయని చెప్పడం తెలిసిందే. అయితే ఈలోపు ఎన్ కన్వెషన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది.

ఈ లోపు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందని.. ప్రధాన నిర్మాణాలను కూల్చి వేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... రేవంత్ రెడ్డి అరెస్ట్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.

అవును... హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ హైడ్రా హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో... ఈ కూల్చివేతల అంశాని స్వాగతిస్తున్నారు సీపీఐ నారాయణ. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. హైడ్రా కూల్చివేతల కారణంగా బడా బాబులు జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.

అదే సమయంలో బడా బాబుల ఒత్తిడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం కూడా ఉందని అన్నారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారుల పనితీరు అభినందనీయమని తెలిపిన నారాయణ... ఎన్ కన్వెషన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి, చెరువును మళ్లీ పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఎఫ్.టీ.ఎల్ పరిధిలో నిర్మించారని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే... సీఎం రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారని.. మధ్యలో ఆపేస్తే అది తినేసుందని హెచ్చరించారు. ఇక ఎం.ఐ.ఎం. అధినేత అసదుద్ధీన్ ఒవైసీ చెబుతున్నట్లుగా ప్రభుత్వ ఆఫీసులు కూల్చివేసే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి.. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని హితవు పలికారు.