Begin typing your search above and press return to search.

పురందేశ్వ‌రికి స‌బ్జెక్టులు దొర‌క‌డం లేద‌ట‌: బీజేపీలో గుస‌గుస‌

ఏపీలో అస‌లే ఎన్నిక‌ల సీజ‌న్‌. పైగా వైసీపీ వంటి బ‌ల‌మైన పార్టీని(సంఖ్యాప‌రంగా) ఎదుర్కొనేందుకు ఏ పార్టీకైనా చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది

By:  Tupaki Desk   |   28 Oct 2023 11:30 AM GMT
పురందేశ్వ‌రికి స‌బ్జెక్టులు దొర‌క‌డం లేద‌ట‌:  బీజేపీలో గుస‌గుస‌
X

ఏపీలో అస‌లే ఎన్నిక‌ల సీజ‌న్‌. పైగా వైసీపీ వంటి బ‌ల‌మైన పార్టీని(సంఖ్యాప‌రంగా) ఎదుర్కొనేందుకు ఏ పార్టీకైనా చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దూకుడు పెరిగింది. మ‌రింత పెంచుతోంది కూడా. మ‌రి వ‌చ్చే 2024లో క‌నీసం గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానాల‌నైనా ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్న బీజేపీకి మాత్రం ఇప్ప‌టికీ.. స‌బ్జెక్టులు ల‌భించ‌డం లేద‌ట‌. ఇదే విష‌యం పార్టీలోనూ చ‌ర్చ‌గా మారింది.

ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. ఇప్ప‌టికి వారానికి రెండు మూడు రోజులు మీడియా ముం దుకు వ‌స్తున్నారు. వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు కూడా గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ప‌దే ప‌దే లిక్క‌ర్ కుంభ కోణంపై ఆమె మాట్లాడుతున్నారు. దీంతో బీజేపీ నేత‌ల‌కే బోర్ కొడుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ''మాకు మాట్లాడేందుకు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు.. స‌బ్జెక్టులు దొర‌క‌డం లేదు. ప‌రిస్థితి చూస్తే ఇలానే ఉంది'' అని ఒక‌రిద్ద‌రు నాయ‌కులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

వాస్త‌వానికి రాష్ట్రంలో వైసీపీ స‌ర్కారుపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై స్పందించేందుకు.. అనేక స‌బ్జెక్టులు ఉన్నాయి. ర‌హ‌దారులు, ప‌థ‌కాలు, అక్ర‌మాలు, అవినీతి, ఇసుక‌, గ‌నులు ఇలా అనేక కార్య‌క్ర‌మాలు ఉన్నాయి. కానీ, వాటి జోలికి పురందేశ్వ‌రి ఎక్క‌డా వెళ్ల‌డం లేదు. కేవ‌లం మ‌ద్యంతోనే ఆమె కాలం వెళ్ల‌దీస్తున్నార‌నే వాద‌న బీజేపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది.

అది కూడా మీడియా మీటింగుల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జాక్షేత్రంలో కాలు మోపింది కూడా లేద‌నే టాక్ సొంత నేత‌ల మ‌ధ్యే హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇదిలావుంటే.. పార్టీలో కీల‌క నాయ‌కులు కూడా.. ముందుకు రావ‌డం లేదు. గ‌తంలో క‌నీసం ఒక‌రిద్ద‌రు వారానికి ఒక్క‌సారైనా మీడియా ముందుకు వ‌చ్చేవారు. వీరిలో విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి, స‌త్య‌కుమార్‌, విష్ణుకుమార్ రాజు వంటి వారు కీల‌కంగా ఉండేవారు. కానీ పురందేశ్వ‌రికి ప‌గ్గాలు అప్ప‌గించాక‌.. వీరంతా సైడైపోయారు. ఇదీ.. సంగ‌తి!