Begin typing your search above and press return to search.

డీఎంకే వజ్రోత్సవాల్లో ఏఐ కరుణానిధి... వీడియో వైరల్!

1947 సెప్టెంబర్ 17న చెన్నైలోని రాబిన్ సన్ పార్కులో ద్రవిడ మున్నెట్ర కళగం (డీఎంకే) పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Sep 2024 7:00 AM GMT
డీఎంకే వజ్రోత్సవాల్లో ఏఐ కరుణానిధి... వీడియో వైరల్!
X

1947 సెప్టెంబర్ 17న చెన్నైలోని రాబిన్ సన్ పార్కులో ద్రవిడ మున్నెట్ర కళగం (డీఎంకే) పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అన్నాదురై, కరుణానిధి వంటి రాజకీయ ఉద్ధండులను రాష్ట్రానికి అందించిన ఈ పార్టీ మంగళవారం వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంది. ఈ కార్యక్రమం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది.

1947లో పుట్టి 1967లో అధికారంలోకి వచ్చిన డీఎంకే సుమారు 25 ఏళ్లు అధికారంలో, 35 ఏళ్లు ప్రతిపక్షంలో కొనసాగింది. ఈ పార్టీకి ఇప్పుడు స్టాలిన్ పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ సమయంలో తాజాగా జరిగిన పార్టీ వజ్రోత్సవ వేడుకల్లో అనూహ్యంగా కరుణానిధి ప్రత్యక్షమయ్యారు. సుమారు ఒక నిమిషం పాటు మాట్లాడారు.

అవును... డీఎంజే వజ్రోత్సవాలు, ఆ పార్టీ వ్యవస్థాకుడు అన్నాదురై, సంఘ సంస్కర్త పెరియార్ జయంతిని "ముప్పెరుం విళా"గా చెన్నైలోని నందనం వైఎంసీఏ గ్రౌండ్ లో నిన్న నిర్వహించారు. ఈ సమయంలో వేదికపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పక్కనే వేసిన ఆసనంలో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి ప్రత్యక్షమయ్యారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించబడిన కరుణానిధి అందరినీ ఆశ్చర్య పరిచారు. అక్కడితో ఈ సర్ ప్రైజ్ అయిపోలేదు. ఏఐ కరుణానిధి కాసేపు మాట్లాడారు కూడా. ఇందులో భాగంగా.. పెరియార్ లక్ష్యాన్ని, అన్నాదురై మార్గాన్ని, తాను కాపాడిన పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన స్టాలిన్ ను తలచుకుని హృదయం గర్విస్తోందని అన్నారు.

సుమారు ఒక నిమిషానికిపైగా సాగిన ఈ ప్రసంగం అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇక కరుణానిధి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మరోపక్క ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... తమ తదుపరి లక్ష్యం 2026 అసెంబ్లీ ఎన్నికలే అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా.. 1967లో తన 13వ ఏట గోపాలపురం యువజన డీఎంకే ప్రారంభించినట్లు చెప్పారు. నాటి నుంచి సుమారు 55 ఏళ్లపాటు పార్టీకి చేసిన కృషి ఫలితంగా నేడు వజ్రోత్సవాల డీఎంకేకు అధ్యక్షుడిగా ఉన్నట్లు తెలిపారు.