Begin typing your search above and press return to search.

అచ్యుతాపురం సెజ్ లో ఘోరం... ఛిద్రమైన మృతదేహాలు.. గుండెలు పిండేసే గాథలు!

ఈ ఘటనలో కాలిపోయిన మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయయి. కొంతమంది కార్మికుల మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి.

By:  Tupaki Desk   |   22 Aug 2024 6:11 AM GMT
అచ్యుతాపురం సెజ్  లో ఘోరం... ఛిద్రమైన మృతదేహాలు.. గుండెలు పిండేసే గాథలు!
X

అచ్యుతాపురం సెజ్ లో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది.. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఈ ఘటనలో 17 మంది మరణించగా.. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.

అవును... మందుల తయారీలో ఉపయోగించే 500 కేఎల్ సామర్ధ్యం ఉన్న రియాక్టర్ పేలడంతో అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ రియాక్టర్ పేలడంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి.. ఇవి క్షణాల్లో వ్యాపించి అల్లకల్లోలం సృష్టించాయి. ఈ పేలుడు దాటికి శ్లాబ్ కూలిపోవడంతో.. అక్కడ పనిచేసే కార్మికులు సుమారు 50 మీటర్ల దూరం ఎగిరిపడిన పరిస్థితి.

ఈ ఘటనలో కాలిపోయిన మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయయి. కొంతమంది కార్మికుల మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. దీంతో.. ఎన్.డీ.ఆర్.ఎఫ్. సిబ్బంది ప్రొక్లెయిన్ సాయంతో శిథిలాలను తొలగించి మృతదేహాలను గుర్తించారు. ఈ సమయంలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు.

ప్రమాదం జరిగిన స్థలాన్ని అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ దీపికా పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతోనూ, అధికారులతోనూ కలెక్టర్ మాట్లాడారు. కంపెనీలో జరిగిన పేలుడు ధాటికి చుట్టు పక్కల గ్రామాల్లొనూ భారీ శబ్ధం వినిపించింది. ఈ సమయంలో కంపెనీ వద్ద స్థానికులు, మృతుల బంధువులు భారీ సంఖ్యలో గుమిగూడారు.

ఇక క్షతగాత్రులను అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లి, వైజాగ్ ఆసుపత్రులకు తరలించారు. ఈ సందర్భంగా మరణించిన మృతులు 17 మంది వివరాలను అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

కంపెనీపై కేసు నమోదు!:

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ ఘటనలో 17 మంది మృతిచెందడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే... ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని మంత్రి వెల్లడించారు. కంపెనీ నుంచి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని అన్నారు.

రాఖీ పండుగ కోసం వెళ్లి...!:

మృతుల్లో ట్రైనీ ఇంజినీర్ హారిక చల్లపల్లి ఒకరు. ఈమె రాఖీ పండుగ కోసం కాకినాడలోని తన కుటుంబాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఫార్మా కంపెనీకి వచ్చారు. ఈ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు మరికొన్ని రోజులు ఉండమని వేడుకున్నా.. ఆమె పట్టుబట్టి మరీ తిరిగి ఉద్యోగ నిమిత్తం వచ్చారు. ఈ సమయంలో విషాదకరంగా ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలమైన కాకినాడకు తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబ సభ్యులు సిద్ధంవుతున్నారు. ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరో 40 రోజుల్లో వివాహం:

మృతుల్లో మరొకరైన పార్ధసారథిది మరో విషాద కథ. ఈ కంపెనీలో ఫిట్టర్ గా పనిచేస్తున్న ఐటీఐ డిప్లొమా హోల్డర్ అయిన పార్ధసారథి వివాహాని వివాహం మరో 40 రోజుల్లో ఉంది. దీంతో అతడి పెళ్లికి కుటుంబం ఆసక్తిగా సిద్ధమవుతోంది. ఈ సమయంలో రియాక్టర్ పేలుడు ధాటికి అతను విగతజీవిగా మారిపోయాడు. త్వరలో పెళ్లి వేడుకలు జరుపుకోవాల్సిన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మృతుల వివరాలు:

నీలాపు రామిరెడ్డి - ఏజీఎం

నారయణరావు మహంతి – అసిస్టెంట్ మేనేజర్

నాగబాబు మొండి - అసిస్టెంట్ మేనేజర్

బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు – అసిస్టెంట్ మేనేజర్

ఆనందరావు బమ్మిడి – ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్

సురేంద్ర మర్ని – ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్

పూసర్ల వెంకటసాయి – సీనియర్ ఎగ్జిక్యూటివ్

జవ్వాది చిరంజీవి – ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్

ప్రశాంత హంస – సీనియర్ ఎగ్జిక్యూటివ్

కొరపాటి గణేష్ కుమార్ - సీనియర్ ఎగ్జిక్యూటివ్

సతీష్ మారిశెట్టి – సీనియర్ ఎగ్జిక్యూటివ్

రాజశేఖర్ - ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్

హారిక చెల్లపల్లి - ట్రైనీ ఇంజినీఅర్

వేగి సన్నాసినాయుడు - హౌస్ కీపింగ్ బాయ్

ఎలబల్లి చిన్నారావు - పెయింటర్

పార్థసారథి - ఫిట్టర్

మోహన్ దుర్గాప్రసాద్ - హౌస్ కీపింగ్ బాయ్