Begin typing your search above and press return to search.

బాబు ఎంట్రీతో గన్నవరం ఎయిర్ పోర్టు రద్దీ కళ

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని రంగాల్లో చోటు చేసుకున్న మార్పులు.. వాటికి సంబంధించిన గణాంకాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

By:  Tupaki Desk   |   28 Aug 2024 3:37 AM GMT
బాబు ఎంట్రీతో గన్నవరం ఎయిర్ పోర్టు రద్దీ కళ
X

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని రంగాల్లో చోటు చేసుకున్న మార్పులు.. వాటికి సంబంధించిన గణాంకాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గతంలో డల్ గా ఉన్న అతిధ్య రంగం పుంజుకోవటమే కాదు.. విమానప్రయాణాలు కూడా బాగా పెరిగినట్లుగా చెబుతున్నారు. హోటళ్ల ఆక్యుపెన్సీలు కూడా పెరిగినట్లుగా తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

చంద్రబాబు నాయకత్వంలో కొలువు తీరిన ఎన్డీయే కూటమి సర్కారు కారణంగా అతిధ్య రంగంలో విశేషమైన మార్పులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిన్నా.. పెద్ద హోటళ్ల వ్యాపారం గతంతో పోలిస్తే దాదాపు 20-30 శాతం వరకు పెరిగినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు సానుకూల నిర్ణయాలతో దేశ.. విదేశాలకు చెందిన పారిశ్రామిక.. వాణిజ్య ప్రముఖులు.. ప్రపంచ బ్యాంక్.. ఏడీబీ లాంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరచూ అమరావతికి రాకపోకలు సాగిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టుతో పాటు.. విజయవాడలోని పలు స్టార్ హోటళ్లు కళకళ లాడుతున్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడకు చెందిన నొవాటెల్.. పార్క్ హయత్ లాంటి హోటళ్లు వచ్చేవి. ట్యాక్సీ డ్రైవర్లకు చేతినిండా పని లభించేది. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు.. కరోనా పుణ్యమాఅని అతిధ్య రంగం దారుణంగా దెబ్బ తింది. ఆ తర్వాత ప్రభుత్వ పాలసీలు అతిధ్య రంగాన్ని కోలుకోకుండా చేశాయని చెబుతున్నారు. కట్ చేస్తే.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు కొలువు తీరిన కొద్ది నెలలకే గన్నవరం ఎయిర్ పోర్టుకు విమాన ప్రయాణాలు బాగా పెరిగినట్లుగా చెబుతున్నారు.

ఈ వాదనకు తగ్గట్లే.. గణాంకాల్ని ఆధారాలుగా చూపిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు 15 వరకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణికుల రాకపోకలు చూస్తే.. ఏప్రిల్ లో 89.4వేలు ఉండగా.. మే నాటికి 95.5వేలు.. జూన్ కు 1.01 లక్షలు.. జులైకు 1.07 లక్షలు.. ఆగస్టు 15 నాటికే 54.1 వేల మంది ప్రయాణికులు రాకపోకల్ని చేపట్టినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఐదేళ్లలో రోజుకు 2500 మందికి తక్కువగా ప్రయాణికుల రాకపోకలు గన్నవరం ఎయిర్ పోర్టులో ఉంటే.. అదికాస్తా ఇప్పుడు 3500లకు పెరిగినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి నడుస్తున్న విమాన సర్వీసులు 22 మాత్రమే. వీటిల్లో నాలుగు సర్వీసులు ఎన్డీయే సర్కారు కొలువు తీరిన తర్వాత వచ్చాయని.. వచ్చేనెలలో ఢిల్లీ.. బెంగళూరుకు మరిన్ని సర్వీసులు ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు.

విమాన ప్రయాణికుల ముచ్చట ఇలా ఉంటే.. విజయవాడలోని స్టార్ హోటళ్ల ఆక్యుపెన్సీ సైతం బాగా పెరిగాయి. ప్రస్తుతం విజయవాడ పరిధిలో 20కు పైగా పెద్దహోటళ్లలో 2 వేలకు పైగా గదులు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో వీటి ఆక్యుపెన్సీరేటు 50 శాతం కంటే తక్కువగా ఉండగా.. ఇప్పుడు 70-80 శాతం మధ్యన ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే వీకెండ్ లో 90 శాతం వరకు ఉండటం గమనార్హం.

అంతేకాదు.. దేశంలో పేరొందిన మారియట్.. రాడిసన్ గ్రూపులు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో తమ తాజా ప్రాజెక్టులు తీసుకురావటానికి రెఢీ అవుతున్నట్లు చెబుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పనులు ఊపందుకుంటే.. దేశ.. విదేశాల నుంచి వచ్చే ప్రముఖులతో హోటళ్లు కిటకిటలాడతాయని.. అందుకు అవసరమైన మరో 3వేల గదుల నిర్మాణంపై బడా హోటళ్లు ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. రాజధాని పనులు మొదలై.. ఉపందుకున్న తర్వాత అతిధ్య రంగం మరింత ఊపందుకోవటం ఖాయమన్న అభిప్రాయాన్ని పారిశ్రామిక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.