Begin typing your search above and press return to search.

రైతులకు బిగ్ గుడ్‌ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్!

అవును... తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   15 July 2024 12:30 PM GMT
రైతులకు బిగ్  గుడ్‌  న్యూస్  చెప్పిన రేవంత్  సర్కార్!
X

తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త వినిపించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా... రుణమాఫీ పథకం మార్గదర్శకాలను విడుదల చేసింది. గత ఎడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు... తెలంగాణలోని రైతులకు రెండు లక్షల మేర రుణాలను ఆగస్టు 15కల్లా మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కేబినేట్ ఆమోదం తెలిపింది.

అవును... తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం అమలు ప్రక్రియపై కసరత్తు చేసిన అధికారులు.. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు. దీంతో... రుణమాఫీ పథకాన్ని అమలు చేయాడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి... ప్రతి రైతు కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ రుణమాఫీ స్వల్పకాలిక పంటల రుణాలకు వర్తించనుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్టుగా.. 12 డిసెంబర్ 2018 నుంచి 09 డిసెంబర్ 2023 మధ్య రైతులు తీసుకున్న రుణాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు స్పష్టం చేసింది.

మరోవైపు.. అన్ని పథకాల మాదిరిగానే ఈ రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డును తప్పనిసరి చేసిన ప్రభుత్వం... రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయనుంది. ఆ వెంటనే లబ్దిదారులందరి రుణాలను మాఫీ చేయనుంది.

రుణమాఫీ మార్గదర్శకాలు ఇవే..!:

తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతుకు రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తింపు.

స్వల్పకాలిక పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.

రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వాటి బ్రాంచ్‌ ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తించనుంది.

12 డిసెంబర్ 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09 డిసెంబర్ 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు వర్తిస్తుంది.

09 డిసెంబర్ 2023 నాటికి బకాయి వున్న అసలు, వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది.

ఈ పథకానికి ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు) ప్రామాణికం.

వ్యవసాయ శాఖ కమిషనర్, సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు.

వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎన్.ఐ.సీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ ను నిర్వహిస్తారు. ఈ ఐటీ పోర్టల్‌ లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది.

ఈ ఐటీ పోర్టల్‌ లో ఆర్థిక శాఖ నిర్వహించే ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్. పోర్టల్‌ కి బిల్లులు సమర్పించటం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడం, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మాడ్యూల్స్ ఉంటాయి.

ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక బ్యాంక్ నోడల్ అధికారిని నియమించాలి. ఈ బ్యాంక్ నోడల్ అధికారి బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎన్.ఐ.సీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. తమ సంబంధిత బ్యాంక్ పంట రుణాల డేటాపై బ్యాంక్ నోడల్ అధికారులు డిజిటల్ సంతకం చేయాలి.

ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుంచి రిఫరెన్స్-1 మెమో జత చేసినట్టి ప్రొఫార్మా-1లో డిజిటల్ సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి.

ప్రతి బ్యాంకు సీ.బీ.ఎస్ నుంచి సేకరించిన డేటాను యదాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడనికి ఏర్పాటు చేయబడింది! అవసరమైతే వ్యవసాయశాఖ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి.

ఈ పథకం కింద లబ్ధిదారులు, రైతుకుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణఖాతాలోని ఆధార్‌ ను పాస్ బుక్ డేటా బేస్‌ లో ఉన్న ఆధార్‌ తో, పీడీఎస్ డేటాబేస్‌ లో ఉన్న ఆధార్‌ తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణ మొత్తం నుంచి రుణమాఫీ 2 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది.

అర్హతగల రుణ మాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారులైన రైతు రుణఖాతాలకు జమచేయనున్నారు. పీఎసీఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచ్‌ కు విడుదల చేయడమవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పీఎసీఎస్‌ లో ఉన్న రైతు ఖాతాలో జమచేస్తారు.

ఏ కుటుంబానికి అయితే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు 2 లక్షలకు పైబడివున్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత.. అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్దతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.