Begin typing your search above and press return to search.

జగన్ కి టైం వచ్చేసిందా...బీజేపీ మొహమాట పడాల్సిందే నా ?

తాజాగా రాజ్యసభలో సభ్యుల బలాబలాలు చూస్తే కనుక బీజేపీకి 86 మంది ఎంపీల మద్దతు ఉంటే ఆ తరువాత ప్లేస్ లో కాంగ్రెస్ కి 26 మంది ఎంపీల బలం ఉంది.

By:  Tupaki Desk   |   15 July 2024 11:30 PM GMT
జగన్ కి టైం వచ్చేసిందా...బీజేపీ మొహమాట పడాల్సిందే నా ?
X

దారుణాతి దారుణంగా ఏపీలో ఓడిన పార్టీగా వైసీపీ ఉంది. ఎక్కడ 151 సీట్లు మరెక్కడ 11 సీట్లు ఏమైనా సాపత్యం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ నేపధ్యంలో చూస్తే వైసీపీకి అండ దండ ఏపీలో శాసనమండలి, కేంద్రంలో రాజ్యసభ. ఈ రెండు చోటో గట్టిగానే వైసీపీ సభ్యులు ఉన్నారు.

రాజ్యసభలో అయితే ఏపీ కోటా నుంచి మొత్తానికి మొత్తం 11 మంది ఎంపీలూ వైసీపీకి చెందిన వారే. వీరి అవసరం కేంద్రంలోని బీజేపీకి ఉంటుందని అనుకున్నా మరీ ఇంత తొందరగా మొహమాట పడాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేరు. కానీ ఈ నంబర్ గేమ్ లో ఇపుడు లక్కీ నంబర్ వైసీపీ పరం అయింది.

ఒక్క మాటలో చెప్పుకోవాలంటే వైసీపీ ఎంపీల మద్దతు లేకుండా బీజేపీ ఒక్క బిల్లుని కూడా పెద్దల సభలో పాస్ చేయించుకోలేదు. తాజాగా చూస్తే బీజేపీ సభ్యుల బలం పెద్దల సభలో ఒక్కసారిగా తగ్గిపోయింది. ఏకంగా 86కి పడిపోయింది. ఆ మధ్యన చూస్తే బీజేపీ వంద మార్క్ కి చేరువగా వచ్చింది అన్న సరదా ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఒక్కసారి కోత పడిపోయింది.

ఇక రాజ్యసభలో బీజేపీకి 86 మంది ఉంటే ఎన్డీయే మిత్రులు అందరూ కలిస్తే 101గా సంఖ్యా బలం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సాధారణ మెజారిటీ కావాలీ అంటే 213 మంది ఉందాలి అని అంటున్నారు. 101కి వైసీపీకి ఉన్న 11 మంది అన్నా డీఎంకేకి ఉన్న నలుగురిని కలిపితేనే బీజేపీకి పెద్దల సభలో బిల్లులు గట్టెక్కే పరిస్థితి ఉంది అని అంటున్నారు.

తాజాగా శనివారం బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎంపీలు నలుగురు రిటైర్ అయ్యారు. రాకేష్ సిన్హా, రాం షకల్, సోనాల్ మాన్ సింగ్, మహేష్ జెఠ్మలానీ రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయ్యారు. వారంతా తాజాగా పదవీ విరమణ చేయడంతో బీజేపీ బలం తగ్గింది.

తాజాగా రాజ్యసభలో సభ్యుల బలాబలాలు చూస్తే కనుక బీజేపీకి 86 మంది ఎంపీల మద్దతు ఉంటే ఆ తరువాత ప్లేస్ లో కాంగ్రెస్ కి 26 మంది ఎంపీల బలం ఉంది. మూడవ ప్లేస్ లో తృణమూల్ కాంగ్రెస్ కి 13 మంది ఉంటే నాలుగవ ప్లేస్ లో వైసీపీకి 11 మంది ఎంపీల బలం ఉంది. ఇక ఆప్ కి డీఎంకేకి చెరో పది మంది ఎంపీల బలం ఉంది. లోక్ సభలో లేకపోయినా రాజ్యసభలో బీఎస్పీకి ఒక ఎంపీ ఉన్నారు.

ఇండియా కూటమికి రాజ్యసభలో మొత్తం 87 మంది ఎంపీల బలం ఉంది. బీఆర్ఎస్ కి నలుగురు ఎంపీలు ఉన్నారు. వారు ఏ కూటమిలో లేరు. ఇంకో వైపు చూస్తే రాజ్యసభలో ఏకంగా ఇరవై మంది ఖాళీలు ఉన్నాయి. మహారాష్ట్ర, అసో, బీహార్ లలో రెండేసి ఎంపీల ఖాళీలు ఉన్నాయి. అలాగే హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణా, త్రిపురలో ఒక్కోటి వంతున ఖాళీలు ఉన్నాయి.

వీటిలో చూస్తే బీజేపీ నేతౄత్వంలోని ఎండీయే కూటమి అసోం, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపురల నుంచి ఏడు ఎంపీలను గెలిచే చాన్స్ ఉంది. మహారాష్ట్రలో సంఖ్యాబలం ఆధారంగా మరో రెండు సీట్లు దక్కినా టోటల్ గా తొమ్మిది మంది ఎంపీలు ఎన్డీయే కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఎటూ నామినేటెడ్ ఎంపీలను బీజేపీ భర్తీ చేసుకోగలదు. ఆ మీదట వైసీపీ ఎంపీల మద్దతు ఉంటే బిల్లులు సులువుగా ఆమోదం పొందుతాయి.

ఈ సమయంలో వైసీపీ ఎంపీల మద్దతు చాలా కీలకం అని అంటున్నారు. లోక్ సభలో చంద్రబాబు మీద ఆధారపడిన బీజేపీకి రాజ్యసభలో జగన్ కాపు కాయాల్సి ఉంటుంది. మొత్తానికి చూస్తే ఈ విధంగా జగన్ కి టైం వచ్చింది అని అంటున్నారు. దీనిని ఆయన ఏ విధంగా ఉపయోగిస్తారో ఏ రకమైన రాజకీయ వ్యూహాలు రూపొందిస్తారో చూడాల్సి ఉంది.