Begin typing your search above and press return to search.

రూ.2లకే తాడేపల్లిగూడెంలో బిర్యానీ.. ఎగబడిన జనం!

ఆఫర్ ఏదైనా దానికో పరిమితి ఉంటుంది. ఆ విషయాన్ని మిస్ అయిన ప్రతిసారీ ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

By:  Tupaki Desk   |   12 Aug 2024 6:39 AM GMT
రూ.2లకే తాడేపల్లిగూడెంలో బిర్యానీ.. ఎగబడిన జనం!
X

ఆఫర్ ఏదైనా దానికో పరిమితి ఉంటుంది. ఆ విషయాన్ని మిస్ అయిన ప్రతిసారీ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ విషయం తాడేపల్లిగూడెం వాసులకు తాజాగా ఎదురైంది. ఒక రెస్టారెంట్ నిర్వాహకుడు ప్రకటించిన బంఫర్ ఆఫర్ కు తాడేపల్లిగూడెంలోని వేలాది మంది ఆ రెస్టారెంట్ కు చేరుకున్నారు. కేవలం రూ.2లకే బిర్యానీ అంటూ ప్రకటించటంతో ఈ వార్త వైరల్ గా మారింది. రెస్టారెంట్ వద్దకు వేలాదిగా చేరుకున్న ప్రజలకు ఆఫర్ లోని నిబంధనల గురించి చెప్పిన రెస్టారెంట్ నిర్వాహకుడు నిరాశకు గురి చేశారు.

తాడేపల్లిగూడెంలోని ఉషా గ్రాండ్ వద్ద కొత్తగా ఒక రెస్టారెంట్ ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ ఆఫర్ కింద రూ.2లకే బిర్యానీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ వార్త ఒక్కసారిగా ఊరు మొత్తం పాకేసింది. ఇంకేముంది.. వందలాది మంది బిర్యానీ కోసం ఎగబడ్డారు. అయితే.. తాము పెట్టిన ఆఫర్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని.. మొదటి 200 బిర్యానీలకు మాత్రమే రూ.2 అంటూ ప్రకటించటంతో నిరాశతో వెనక్కి తిరిగారు. కొందరు తిట్టేసుకున్న పరిస్థితి.

లిమిటెడ్ ఆఫర్ అని పెట్టాల్సింది కదా? అంటూ విసుక్కుంటూ వెనుదిరిగారు పలవురు. వందలాది మంది హోటల్ వద్దకు చేరుకోవటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు నానా తిప్పలు పడ్డారు. నిజానికి ఈ తరహా ఆఫర్లు మొత్తం కేవలం ప్రచారం కోసమే. ఇలాంటి వాటి కారణంగా అనవసరమైన ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయి. పబ్లిక్ న్యూసెన్స్ గా మారే ఈ తరహా ట్రిక్కుల విషయంలో పోలీసులు స్పందించాలని.. ముందస్తు అనుమతులు తీసుకోవాలని చెప్పటం మంచిదంటున్నారు.