Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ డాక్టరే అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ సూత్రధారి!

కేరళలో వెలుగుచూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 May 2024 6:13 AM GMT
హైదరాబాద్‌ డాక్టరే అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ సూత్రధారి!
X

కేరళలో వెలుగుచూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూరు, హైదరాబాద్‌ లకు చెందిన పేద యువకులను ఇరాన్‌ తీసుకెళ్తున్న ముఠా సభ్యులు.. అక్కడ వారి కిడ్నీలను విక్రయింపజేస్తున్నారనే విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో ఈ కిడ్నీ రాకెట్ కు సంబంధించిన సూత్రధారి హైదరాబాద్‌ కు చెందిన ఒక వైద్యుడని కేరళ పోలీసులు గుర్తించారని తెలుస్తుంది.

అవును... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో తాజాగా కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి. కొచ్చి విమానాశ్రయంలో ఈ ముఠాలోని కీలక సభ్యుడు పట్టుబడటం.. అనంతరం అతడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్‌ కు చెందిన ముగ్గురు దళారులు ఈ రాకెట్‌ ను నడిపించారని.. ఆ ముగ్గురిలో ఒక డాక్టర్ కూడా ఉన్నాడని తేలిందని చెబుతున్నారు.

దీంతో... ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇక్కడి మరో ఇద్దరు దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో... అసలు సూత్రదారిగా చెబుతున్నా ఆ హైదరాబాద్ వైద్యుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి బెంగళూరు, హైదరాబాద్‌ లకు చెందిన పేద యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి.. అక్కడ కిడ్నీలను అమ్మేస్తున్న వ్యవహారంలో... బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందారు. దీంతో... అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే ముఠాలోని కీలక సభ్యుడు ఇరాన్‌ నుంచి కొచ్చి రాగా.. అతడిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

అతడు చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ కు చెందిన వైద్యుడే ఈ వ్యవహారానికి ప్రధాన కారణం అని అంటున్నారు. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్‌ వైద్యుడు, తాజాగా పోలీసులకు చిక్కిన కీలక ముఠా సభ్యుడి మధ్య స్నేహం మొదలైందంట. ఈ క్రమంలోనే బెంగళూరు, హైదరాబాద్‌ ల నుంచి సుమారు 40 మంది యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి, కిడ్నీలు విక్రయించినట్లు అతడు అంగీకరించాడని అంటున్నారు.

వ్యవహారం జరుగుతుంది ఇలా..!:

ఈ రాకెట్ లోని ముఠాసభ్యులు... డబ్బు అవసరం ఉన్న పేద యువతను గుర్తించి, వారికి డబ్బు ఆశ చూపించి, కిడ్నీలు విక్రయించేలా ఒప్పిస్తున్నారట. వారు ఒప్పుకున్న అనంతరం వారికి కావాల్సిన పాస్‌ పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూర్చి ఇరాన్‌ కు తరలిస్తున్నారట.

ఈ సమయంలో ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారట. అనంతరం 20 రోజులపాటు కిడ్నీ దాతను అక్కడే ఓ అపార్ట్మెంట్లో ఉంచి.. కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారని అంటున్నారు. ఇలా ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు రూ.20 లక్షల వరకూ ఇస్తామని ఆశపెడుతున్నప్పటికీ.. చివర్లో రూ.6 లక్షలు ముట్టజెబుతున్నారని అంటున్నారు.