Begin typing your search above and press return to search.

మోడీ ప్రభంజనం... నిజమేనా ?

కానీ ఏకంగా 370 పై దాటి ఎన్డీయే కూటమికి సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు వేసిన అంచనాలు ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ అయితే వస్తోంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 5:30 PM GMT
మోడీ ప్రభంజనం... నిజమేనా ?
X

దేశంలో మోడీ ప్రభంజనం వీచిందా. అది అంత బలంగా ఉంటుందా. ఎపుడో కేవలం యాభై కోట్ల లోపు జనాభా, 30 కోట్ల మంది ఓటర్లు ఉంటూ ఇంతగా చైతన్యం లేని రోజులలో నాయకుడి ఆరాధన తారస్థాయిలో ఉండడం వల్ల పండిట్ నెహ్రూ మూడోసారి కూడా అద్భుతమైన మెజారిటీతో భారీ సీట్లను సాధించారు.

కానీ ఇపుడు ఉన్న ఆధునిక యుగంలో ప్రతీ ఓటరూ తెలివి మీరిన నేపధ్యంలో పదేళ్ళ పాటు కేంద్రంలో బీజేపీ మోడీ నాయకత్వంలో పనిచేసి యాంటీ ఇంకెంబెన్సీ ఎంతో కొంత మూటకట్టుకున్న పరిస్థితులలో కూడా హ్యాట్రిక్ విజయం మోడీకి దక్కుతుంది అంటే అది ఓకే అనుకోవచ్చు. కానీ ఏకంగా 370 పై దాటి ఎన్డీయే కూటమికి సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు వేసిన అంచనాలు ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ అయితే వస్తోంది.

ఈసారి ఎగ్జిట్ పోల్స్ అన్నీ దేశంలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా తేల్చేశాయి. అంతే కాదు ఇండియా కూటమికి అంతా కూడబలుక్కుని ఇచ్చినట్లుగా 150 ఎంపీ సీట్లనే ఇచ్చాయి. దాంతో మరోసారి అంగరంగ వైభవంగా దేశంలో మోడీ పాలన వస్తుందని తేల్చేశాయి.

మరో వైపు ఇండియా కూటమి ఈ విషయాన్ని ముందే పసిగట్టినట్లుగా ఎగ్జిట్ పోల్స్ మీద టీవీ డిబేట్లకు తాము రాము అని చెప్పేసింది. మరి ఇండియా కూటమికి ఎగ్జిట్ పోల్ సర్వేల మీద ఏ రకమైన అంచనాలు ఉన్నాయో తెలియదు. కానీ తామే అధికారంలోకి వస్తామని అది ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ తో అంటే జూన్ 4న తేలుతుందని అంటున్నాయి.

ఇక చూస్తే ఇండియా కూటమి ఈసారి దూకుడుగా ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ కూడా గతం కంటే చాలా మెచ్యూరిటీగా ప్రసంగాలు చేశారు. దేశంలోని సమస్యలను లేవనెత్తింది కూడా కాంగ్రెస్ పార్టీనే. సగటు ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఇండియా కూటమి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించింది. అధిక ధరలు ద్రవ్యోల్బనం, నిరుద్యోగం వంటివి ప్రభావం చూపిస్తాయని ఇండియా కూటమి అంటోంది.

మరి ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు చూస్తే అలా కాకుండా బీజేపీ నమ్ముకున్న అజెండానే జనాలు జై కొట్టారా అన్న చర్చకు అస్కారం ఏర్పడుతోంది. ఏది ఏమైనా ఈసారి మోడీ గెలుస్తారు అన్నది స్థూలంగా ఎగ్జిట్ పోల్స్ తేల్చిన మాట. అయితే అవి ఇస్తున్న భారీ నంబర్ కనుక వస్తే మోడీ ప్రభంజనం బలంగా వీచినట్లుగానే భావించాలి. అదే సమయంలో విపక్షాల వైఫల్యంగానూ చూడాలి. అసలు ఏ రకమైన ఫలితాలు వస్తాయన్నది మాత్రం తేలేది జూన్ 4న వచ్చే రిజల్ట్ తోనే తెలుస్తుంది. మరోసారి మోడీ మంచి మెజారిటీతో గెలిస్తే మాత్రం దేశంలో కాషాయ పార్టీకి తిరుగులేనట్లే అనుకోవాల్సి ఉంటుంది.