Begin typing your search above and press return to search.

తెలంగాణలో టీడీపీ పోటీపై స్పష్టత వచ్చినట్టేనా?

వాటిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా 119 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 6:02 AM GMT
తెలంగాణలో టీడీపీ పోటీపై స్పష్టత వచ్చినట్టేనా?
X

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టు కావడంతో జైలులో ఉన్నారు. ఇదొక్కటే కాకుండా మరికొన్ని కేసులను కూడా జగన్‌ ప్రభుత్వం ఆయనపై సిద్ధం చేసింది. ఈ అన్ని కేసులకు సంబంధించి చంద్రబాబు బెయిల్‌ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ను అరెస్టు చేయొచ్చని బలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పోటీకి ప్రధాన అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ అ«ధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తాము 75 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేసినట్లు తెలిపారు. మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.

ఇప్పటికే రాజమహేంద్రవరం జైలులో పార్టీ అధినేత చంద్రబాబును ములాఖత్‌ లో కలిసి మాట్లాడానని కాసాని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందన్నారు. శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని తెలిపారు. జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని చెప్పారు.

తమకు 75 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు ఆమోదించాక పేర్లను ప్రకటిస్తామన్నారు. టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారు అని కాసాని జ్ఞానేశ్వర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

తెలంగాణలో టీడీపీ పోటీపై కొన్ని మీడియా సంస్థలు, కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాటిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా 119 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతిస్తుందని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను కాసాని జ్ఞానేశ్వర్‌ ఖండించారు. పార్టీకి సంబంధించి ఏదైనా ఉంటే తానే దానిని మీడియా ముందు ప్రకటిస్తానని తెలిపారు. టీడీపీ ఎన్నికలకు వెళితే ఓటమి చవిచూడాల్సి వస్తుందన్న భయంతో ఇలాంటి పుకార్లకు పాల్పడుతున్నారని కాసాని ఆరోపించారు.

తెలంగాణలో తాము జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. పొత్తుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్‌ అని చెప్పారు. మరోసారి చంద్రబాబును ములాఖత్‌ లో కలిశాక భవిష్యత్‌ నిర్ణయం ప్రకటిస్తామని కాసాని స్పష్టం చేశారు.

చంద్రబాబు జైలులో ఉండటంతో అభ్యర్థులను ప్రకటించే విషయంలో కొంత ఆలస్యమవుతోందని కాసాని జ్ఞానేశ్వర్‌ వెల్లడించారు. టీడీపీకి పెరుగుతున్న ఆదరణతో ప్రత్యర్థులు తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కాంగ్రెస్‌ కు మద్దతు ఇస్తున్నామంటూ ఆరోపణలు చేస్తున్నారని కాసాని జ్ఞానేశ్వర్‌ మండిపడ్డారు.