Begin typing your search above and press return to search.

నాటి బాబు స్ట్రాటజీతో జగన్ దూకుడు

ఇపుడు ఆ స్ట్రాటజీనే తిరిగి జగన్ వాడేస్తున్నారు. ఆయన లేటెస్ట్ గా తాడేపల్లిలో జరిగిన పార్టీ మీటింగులో నేతల్తో ఇదే మాట చెప్పారు. జమిలి ఎన్నికలు అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 7:30 AM GMT
నాటి బాబు స్ట్రాటజీతో జగన్ దూకుడు
X

రాజకీయాల్లో ప్రత్యర్థుల నుంచి ఇంపుట్స్ కూడా తీసుకుంటూంటారు. అవి అవసరం అయినపుడు వాడుతూంటారు. రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు తన పార్టీని 2019 నుంచి 2024 వరకూ అయిదేళ్ళ పాటు ఎలా కాపాడుకున్నారో అందరికీ తెలిసిందే. జగన్ 151 సీట్లతో గెలిచిన మరుసటి రోజు నుంచే అదిగో ఎన్నికలు ఇదిగో ఎన్నికలు అంటూ క్యాడర్ ని ఉత్తేజపరిచారు.

వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని కూడా చెబుతూ వచ్చేవారు. మూడు రాజధానుల మీద కోర్టులో ఇబ్బంది అయితే జగన్ అసెంబ్లీ రద్దు చేస్తున్నారని ప్రచారం కూడా అప్పట్లో సాగింది. ఇక దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా దానితో ఏపీని ముడి పెట్టి అక్కడా ఇక్కడా ఒకేసారి ఎన్నికలకు జగన్ పావులు కదుపుతున్నరని కూడా ప్రచారం సాగింది. ఆఖరుకు తెలంగాణా ఎన్నికల్లో కూడా ఏపీని కలిపి జగన్ నిర్వహిస్తారు అని చెప్పుకొచ్చారు.

అయితే అవేమీ జరగలేదు కానీ టీడీపీ మాత్రం ఉత్తేజం అవుతూ వచ్చింది. ఎపుడు ఎన్నికలు జరిగినా పార్టీ సిద్ధంగా ఉండాలని నాడు చంద్రబాబు పార్టీ మీటింగ్స్ లో తరచూ చెప్పే మాటగా ఉండేది. దాంతో ఎన్నికలు వస్తాయి కదా అని నేతలు జనంలోకి వచ్చేవారు. క్యాడర్ కూడా అయిదేళ్ళూ రోడ్డు మీదనే ఉంది.

ఇపుడు ఆ స్ట్రాటజీనే తిరిగి జగన్ వాడేస్తున్నారు. ఆయన లేటెస్ట్ గా తాడేపల్లిలో జరిగిన పార్టీ మీటింగులో నేతల్తో ఇదే మాట చెప్పారు. జమిలి ఎన్నికలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దాని మీద స్టడీ చేస్తోంది. దాంతో ఎన్నికలు ఎపుడైనా రావచ్చు అని జగన్ ఒక కీలక సందేశం పార్టీకి ఇచ్చారు.

ఎన్నికలు ఎపుడు వచ్చినా కూడా నేతలు అంతా సిద్ధంగా ఉండాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలు అదిగో వచ్చేస్తున్నాయని కూడా ఆయన ప్రకటించేస్తున్నారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా వైసీపీదే విజయం అని కూడా ఆయన ధీమాగా చెబుతున్నారు.

అందువల్ల పార్టీ నేతలు అంతా ఇప్పటి నుంచే జనంలో ఉండాలని ప్రజలతో రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేయాలని కోరుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే అవకాశాలు ఇస్తామని కూడా జగన్ చెబుతున్నారు. ఎవరైతే జనంలో ఉంటారో వారికే ప్రమోషన్లు అని కూడా ఆయన ఊరిస్తున్నారు.

మొత్తానికి చూస్తే వైసీపీలో నాలుగు నెలలుగా ఒక రకమైన నైరాశ్యం అయితే వెంటాడుతోంది. పార్టీని ఎలా లేపాలా అని ఆలోచిస్తున్న వైసీపీ అధినాయకత్వానికి జమిలి ఎన్నికల మీద కేంద్ర స్థాయిలో చర్చలు జరగడం అనుకోని వరంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతోంది అని వస్తున్న వార్తలతో వైసీపీ అలెర్ట్ అవుతోంది.

దాంతో ఇదే మాటను జగన్ కూడా క్యాడర్ కి లీడర్ కి చెబుతున్నారు. అయితేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండాల్సింది లేదు, రెండేళ్ళలో ఎన్నికలు వస్తాయని కూడా చెప్పడం ద్వారా మొత్తానికి మొత్తం ఫ్యాన్ పార్టీని రీ చార్జి చేస్తున్నారు. మరి జగన్ ఆలోచనలు ఎంతవరకూ క్యాడర్ తీసుకుని జనంలోకి వెళ్తుందో చూడాల్సి ఉంది. జమిలి ఎన్నికలు వస్తే టికెట్ల కోసం నేతలు ఎటూ సిద్ధంగా ఉంటారు. దాంతో వారిలోని ఆశలే ఇపుడు వైసీపీకి ఆక్సిజన్ అని అంటున్నారు. ఈ విధంగా బాబు స్ట్రాటజీనే జగన్ ఎడా పెడా వాడేస్తున్నారు అని అంటున్నారు.