Begin typing your search above and press return to search.

చంద్రబాబు జగన్ ఇద్దరూ వెల్ కం చెప్పారు

అయితే ఈ ఇద్దరూ ఒక్క అంశంలో మాత్రం ఏకాభిప్రాయంగానే ఉన్నారు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 1:52 PM GMT
చంద్రబాబు జగన్ ఇద్దరూ వెల్ కం చెప్పారు
X

ఏపీలో రాజకీయం గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వారికి అయినా అధికార టీడీపీ కూటమికి విపక్ష వైసీపీకి ఏ అంశంలోనూ సరిపడదనే చెబుతారు. కనీస మాత్రంగా కూడా ముఖా ముఖీగా చూసుకునేందుకు బాబు జగన్ అసలు ఇష్టపడరు.

ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఒకరు ఎడ్డెమంటే రెండవ వారు తెడ్డెం అంటారు. అయితే ఈ ఇద్దరూ ఒక్క అంశంలో మాత్రం ఏకాభిప్రాయంగానే ఉన్నారు. సుప్రీం కోర్టు శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో ఇచ్చిన తీర్పుని ఇద్దరూ వెల్ కం చేశారు పైగా ఇద్దరూ దేవుడు ఉన్నారు ధర్మం గెలుస్తుంది అని వ్యాఖ్యానించారు

సీబీఐ ఆధ్వర్యంలో అయిదురుగు సభ్యులతో సిట్ ని ఎర్పాటు చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వెలువడడంతోనే చంద్రబాబు స్వాగతిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతే కాదు నమో వెంకటేశా అని ట్వీట్ కూడా చేశారు.

ఇక మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అయితే ఈ తీర్పుని స్వాగతిస్తున్నామని అన్నారు. చంద్రబాబు వేసిన ఏకపక్ష సిట్ ని పక్కన పెట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ వేశారు అని చెప్పారు. అందుకే తాము వెల్ కం చెబుతున్నామని చెప్పారు. దీని వల్ల అసలు వాస్తవాలు బయటకు వస్తాయని జగన్ అంటున్నారు

మరో వైపు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని టీడీపీ కూటమి ప్రభుత్వం సిట్ ని వేస్తే వైసీపీ ఒప్పుకోలేదని ఇపుడు సుప్రీం కోర్టు కూడా సిట్ నే వేసిందని అసలు నిజాలు ఇక మీదట బయటకు వస్తాయని కూడా చెప్పారు. వైసీపీ వారు చేసిన తప్పులకు సిద్ధంగా ఉండాలని టీడీపీ ట్వీట్ చేసింది.

వైసీపీ అయితే టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు అని పేర్కొంది. ఇక మీదత స్వతంత్రంగా జరిగే దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వస్తాయని దానివల్ల ప్రజలకు అసలు జరిగింది ఏమిటో తెలుస్తుంది అని వైసీపీ పేర్కొంటోంది.

మొత్తానికి చూస్తే సుప్రీం కోర్టు తీర్పుని అటు టీడీపీ ఇటు వైసీపీ ఆమోదిస్తున్నాయి. అలాగే జగన్ చంద్రబాబు ఇద్దరూ కూడా తీర్పు బాగుందని అంటున్నారు. ఏపీలో ఉప్పు నిప్పులా ఉన్న ఈ రెండు పార్టీలు రెండు పార్టీల అధినేతల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఒక్కటి చేసింది అని అంటున్నారు.

ఇక ఈ తీర్పు తమ విజయం అంటే తమకు విజయం అని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. నిజానికి సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అన్నది వైసీపీ విజయం అయితే అందులో ఏపీకి చెందిన ఇద్దరు అధికారులు ఉండడం టీడీపీ విజయంగా భావిస్తోంది. ఏది ఏమైనా ఈ సిట్ కచ్చితమైన దర్యాప్తు చేసి ఏదో ఒక నివేదికను బయటకు తెచ్చి కోట్లాది హిందూ భక్తులకు స్వాంతన కలిగించాలని అంతా కోరుకుంటున్నారు.