Begin typing your search above and press return to search.

యాంకర్ శ్యామల విషయంలో జగన్ కీలక నిర్ణయం... వాట్ నెక్స్ట్?

అవును... తాజాగా వైసీపీ అధికార ప్రతినిధుల లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాలో భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్, ఆర్కే రోజాతో పాటు యాంకర్ శ్యామలకు జగన్ అవకాశం కల్పించారు.

By:  Tupaki Desk   |   14 Sep 2024 6:12 AM GMT
యాంకర్  శ్యామల విషయంలో జగన్  కీలక నిర్ణయం... వాట్  నెక్స్ట్?
X

జగన్ కొత్త టీం కి తయారుచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వైసీపీ అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా నలుగురు అధికార ప్రతినిధులను ఎంపిక చేసిన జగన్ అందులో ఇద్దరు మహిళలకు స్థానం కల్పించారు. ఈ క్రమంలో... యాంకర్ శ్యామలకు కీలక బాధ్యతలు అప్పగించారు.

అవును... తాజాగా వైసీపీ అధికార ప్రతినిధుల లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాలో భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్, ఆర్కే రోజాతో పాటు యాంకర్ శ్యామలకు జగన్ అవకాశం కల్పించారు. దీంతో... శ్యామలకు జగన్ బిగ్ పొలిటికల్ బాటే వేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల సమయంలో వైసీపీ తరుపున బలంగా ప్రచారం చేసినవారిలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. ఏయే నియోజకవర్గాల్లో వైసీపీ బ్యాలెట్ నెంబర్ ఎంతో కూడా చెబుతూ ఆమె సోషల్ మీడియాలో క్యాంపెయిన్ లా నిర్వహించారు! ఓటమి తర్వాత కూడా ఆమె పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ సమయంలో ఆమెకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.

ఇక శ్యామల భర్త నరసింహారెడ్డి కడప వాసి కాగా.. ఆమె కోస్తా జిల్లాల బ్రాహ్మణ అమ్మాయి. అయితే భార్యాభర్తలిద్దరూ సినీ రంగంలోనే పనిచేస్తున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో ఉంటే అవకాశాలు పోతాయేమోననే భయం వంటివి లేకుండా ముందుకు వచ్చారు శ్యామల. రాబోయే రోజుల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!

ఇక గతకొన్ని రోజులుగా ఆర్కే రోజా విషయంలో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఆమె పార్టీని వీడుతున్నారని.. జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఆమె హాజరుకాకపోవడంపైనా తీవ్ర చర్చ జరిగింది. అయితే... ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో జగన్ జరిపిన సమావేశంలో రోజా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్ తో ప్రత్యేకంగా దిగిన ఫోటోలను ఎక్స్ లో షేర్ చేశారు. పార్టీ మారబోతున్నారంటూ తనపై వచ్చిన పుకార్లకు చేతలతోనే సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆమెకు మరోసారి కీలక బాధ్యతలు అప్పగిస్తూ అధికార ప్రతినిధిని చేశారు జగన్.

దీంతో... మరోసారి రోజా మార్కు విమర్శలు మీడియాలో హైలెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న భూమన కరుణాకర్ రెడ్డితో పాటు, వైఎస్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే పేరు సంపాదించుకున్న జూపూడికి జగన్ అవకాశం కల్పించారు.

మరి ఈ కొత్త టీమ్ ఏ మేరకు పార్టీ వాయిస్ ని ప్రజల్లోకి తీసుకెళ్తారనేది వేచి చూడాలి. ఈ సమయంలో యాంకర్ శ్యామల పైనా ప్రజల దృష్టి ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.