Begin typing your search above and press return to search.

చంద్రబాబు లిక్కర్ మాఫియాతో భారీ అవినీతి స్కెచ్?

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. కూటమి సర్కారు అనుసరిస్తున్న లిక్కర్ విధానాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు

By:  Tupaki Desk   |   15 Oct 2024 4:24 AM GMT
చంద్రబాబు లిక్కర్ మాఫియాతో భారీ అవినీతి స్కెచ్?
X

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. కూటమి సర్కారు అనుసరిస్తున్న లిక్కర్ విధానాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. అంతేకాదు.. తన లిక్కర్ మాఫియాతో సీఎం చంద్రబాబు అవినీతి స్కెచ్ వేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ మాఫియాకు సూత్రధారి.. పాత్రధారి చంద్రబాబేనంటూ మండిపడ్డారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్ని మూసేస్తూ.. వాటిని ప్రైవేటు వారికి.. మీ పార్టీ వారికి అప్పగించాలన్న చంద్రబాబు నిర్ణయం మొత్తం అవినీతి కోసం వేసిన స్కెచ్ గా అభివర్ణించారు.

పారదర్శకంగా సాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల్ని మూసేయటాన్ని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. చంద్రబాబు తెచ్చిన లిక్కర్ పాలసీ గొప్పదే అయితే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. ‘మీ మనుషులతో సిండికేట్ ఏర్పాటు చేసి షాపులను కొట్టేయటం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలో పెద్దమొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలతో అమ్మి..వేలాది కోట్ల రూపాయిల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచి మాట వాస్తవమే కదా?’’ అంటూ ప్రశ్నించారు.

‘నీకింత.. నాకింత’ అంటూకమిషన్లను వాటాలు వేసకున్న మాట వాస్తవం కదా? అని ప్రశ్నించిన జగన్.. ‘‘ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? ఇది ఓ ఫారసు కాదా? లైసెన్స్ ఫీజులతో పాటు మీ వరకు వచ్చే కమీషన్ల కోసం.. మీవారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించటం కోసం లిక్కర్ కొనుక్కకున్న వారికి జేబులు గుల్ల చేయటానికి మీరంతా సిద్ధమైనట్లే కదా?’’ అని ప్రశ్నించారు.

ఏపీ కొత్త లిక్కర్ పాలసీతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రానివ్వకుండా.. మీరు గండికొట్టారన్న జగన్మోహన్ రెడ్డి.. ప్రజలను మధ్య పెట్టేందుకు చీప్ లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించి.. ఈ కారణంగా నాణ్యతను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు. అమ్మకాల్నివిపరీతంగా పెంచేసి.. తద్వారా డిస్టలరీల నుంచి లంచాలు ఆదాయం పెంచుకునే కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా చెప్పారు.

ఏపీలో ఉన్న 20 డిస్టలరీల్లో 14 చంద్రబాబు హయాంలోనే వచ్చాయని.. వైసీపీ హయాంలో ఒక్క డిస్టలరీకి అనుమతి ఇవ్వలేదన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మార్పీ మీద వసూలు చేయటం.. ప్రజల నడ్డి విరగొట్టం కాదా చంద్రబాబు? అని ప్రశ్నించారు. మొత్తంగా కూటమి సర్కారు తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చీల్చి చెండాడని చెప్పక తప్పదు.