Begin typing your search above and press return to search.

బీరూ బ్రాందీ తాగేవాళ్ళు జగన్ కి ఓటు వేస్తారా ?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఒక కొత్త ఓటు బ్యాంకు పుట్టుకుని వచ్చింది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 12:19 PM GMT
బీరూ బ్రాందీ తాగేవాళ్ళు జగన్ కి ఓటు వేస్తారా ?
X

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఒక కొత్త ఓటు బ్యాంకు పుట్టుకుని వచ్చింది. అది అనివార్యంగా పుట్టిందా లేక దానికి రాజకీయ పార్టీలు బయటకు తీసి స్ట్రాంగ్ హోల్డ్ కలిగిన ఓటు బ్యాంక్ గా మార్చుకున్నారా అన్నది కనుక పక్కన పెడితే ఈసారి జరిగిన ఎన్నికల్లో వారి ఓటు షేర్ కూడా బాగానే ఉందని లెక్కేశారు. ఆ ఓటు షేర్ టీడీపీ కూటమికే మొత్తానికి మొత్తం గుత్తంగా పడిందని కూడా అంచనా వేశారు.

ఇదిలా ఉంటే ఆ ఓటు బ్యాంక్ ఏమిటి అన్నది ఈ పాటికి అందరికీ అర్థం అయి ఉంటుంది. వారే మందు బాబులు. ఓటేసి ప్రభుత్వాలను తీసుకుని రాగలరు, ఆ మీదట తాము ఖజానాకు బాసటగా కూడా ఉండగలరు అని నిరూపించుకున్నారు. ఏపీలో మందు బాబులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది.

దీని మీద సోషల్ మీడియాలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయినా కూడా ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ అని ప్రకటించింది. నాణ్యమైన మందుని మంచి బ్రాండ్లను అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ విధంగానే అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

ఈ సందర్భంగా వైసీపీ హయంలో లిక్కర్ పాలసీ గురించి ఆనాటి మద్యం బ్రాండ్ల గురించి నాటి ప్రతిపక్షం టీడీపీ దారుణంగా విమర్శలు చేసేది. ఈ లిక్కర్ తాగి కడుపు నొప్పులు, కంటి నొప్పులు కాలి నొప్పులు ఇలా అన్నీ వచ్చేవని కూడా నాటి విపక్షం తెగ యాగీ చేసేది. అంతే కాదు పచ్చ చానళ్ళు అయితే దీని మీద అదే పనిగా ఊదరగొట్టి మరీ జగన్ ప్రభుత్వం ఇమేజ్ ని డ్యామేజ్ చేసి పారేశాయి.

మొత్తం మీద చూస్తే వైసీపీ చేతిలో నుంచి అధికారం అయితే పోయింది. టీడీపీ కూటమికి అధికారం దక్కింది. ఇక చూస్తే ఏపీలోని మొత్తం జనాభాలో 28 శాతం పైగా మందు తాగుతారు అని అంచనాలు ఉన్నాయి. అలా తీసుకుంటే కనుక ఆ ఓట్లు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం మందు బాబుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది కూడా అందుకే. ఏపీలో లిక్కర్ ని చవకగా నాణ్యమైనది ఇస్తున్నారు. అలా కాకుండా ఒక వేళ బీరు, బ్రాందీలను కూడా మరింతగా ధరలు తగ్గించి ఇస్తే కనుక కూటమికే మందు బాబులు మళ్ళీ మళ్ళీ ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందని కూడా అంటున్నారు.

అలా బీరూ బ్రాందీ తాగేవాళ్ళు జగన్ కి అసలు ఓటే వేయరు అని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ ప్రభుత్వంలో ఆ నాలుగు డిస్టలరీస్ వాళ్ళే అంతా నడిపించారని, మొత్తానికి జే బ్రాండ్ లిక్కర్ ని తయారు చేశారని అప్పట్లో ప్రచారం హోరెత్తిపోయింది. దాని వల్లనే ప్రభుత్వం పోవడానికి చాలా ప్రధాన కారణం అయింది అని అంటున్నారు.

నిజం చెప్పాలీ అంటే ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికలు ఒక కొత్త చరిత్రనే సృష్టించాయి. అంతే కాదు కొత్త ఓటు బ్యాంక్ ని కూడా క్రియేట్ చేశాయి. ఇప్పటిదాకా ఎన్నికల్లో మందు తాగబోయించి ఓట్లు వేయించుకున్న చరిత్రనే అంతా చూశారు. కానీ ఫస్ట్ టైం ఎన్నికలో మంచి మద్యం చవక ధరకు అని హామీలు ఇచ్చి ప్రభుత్వం రావడానికి మందు బాబులనే వాడుకున్న హిస్టరీ మాత్రం లేదు.

ఇలా ఎందుకు జరిగింది అంటే కనుక కాదేదీ ఆ వర్గం ఈ వర్గం అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ విషయంలోనూ అతి ఉత్సాహం చూపించి చేతులు కాల్చుకుంది. మాంసం తిన్నామని ఎముకలు మెడలో వేసుకుంటారా అన్నదే ఇక్కడ ప్రశ్న. మద్యం విషయంలో ప్రభుత్వాలకు ఎపుడూ తలనొప్పే. అలాంటి దానిని ప్రభుత్వమే నేరుగా దుకాణాలు నడపడం,

అక్కడ కూడా ప్రముఖ బ్రాండ్లు లేకుండా నాసిరకం ఉంచారని ఆరోపణలు ఎదుర్కోవడం, అధిక ధరలకు అమ్మడం ఇలా అయిదేళ్ళూ మందు బాబులను టార్చర్ పెట్టారు అని ప్రతిపక్షం చేసిన ఆరోపణలకు బలం కూడా వచ్చింది. అలా ఒక కొత్త ఓటు బ్యాంక్ క్రియేట్ అయింది. అది ఎప్పటికీ వైసీకీ వైపు చూడని ఓటు బ్యాంక్ కూడా అవుతుందేమో అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే మందు బాబులు తాగి నిలకడగా లేకపోవచ్చు కానీ మాట మీద మాత్రం కచ్చితంగా నిలబడతారు కాబట్టి. సో ఇపుడు అన్ని వర్గాలను దగ్గర తీయాల్సిన వైసీపీకి మందు బాబులే బిగ్ టాస్క్ అని అంటున్నారు.