Begin typing your search above and press return to search.

జగన్ తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్ కు ఛార్జిమెమో!?

గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Sep 2024 5:37 AM GMT
జగన్  తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్  కు ఛార్జిమెమో!?
X

గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కానిస్టేబుల్ అయేషాబాను, తన కుమార్తెతో కలిసి జగన్ తో సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమయంలో అమెపై చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

అవును... గుంటూరు జిల్లా జైలు వద్ద బుధవారం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ అయేషాబానుకు ఛార్జ్ మెమో ఇస్తామని జైలర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఇలా చేయడంపై జైలు అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. దీనిపై వైసీపీ స్పందించింది.

జగన్ తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటారంటూ కథనాలొస్తున్న వేళ వైసీపీ "ఎక్స్" వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా... వైఎస్ జగన్ తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ పై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని పేర్కొంది! ఆమెకు ఛార్జ్ మెమో ఇస్తారంట.. ఆమె వివరణ తర్వాత విచారణకు కమిటీ వేస్తారంట అని తెలిపింది.

ఈ సమయంలో ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనంతోపాటు... జగన్ తో అయేషాబాను, ఆమె కుమార్తె కలిసి సెల్ఫీ తీసుకున్న ఫోటోనూ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా... "ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షసానందం చంద్రబాబు, హోంమంత్రి అనిత?" అని ప్రశ్నిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసింది.