సాయిరెడ్డి అయినా ఎవరైనా...జగన్ సంచలన కామెంట్స్
ఆయనను జగనే కావాలని బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నంలో ఇదొక భాగమని కూడా కొందరు అనుకున్నారు.
By: Tupaki Desk | 6 Feb 2025 9:15 AM GMTవైసీపీకి నంబర్ 2 గా ఉంటూ జగన్ కి ఆత్మ గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజకీయాలకు స్వస్తి చెప్పి బయటకు వెళ్ళిపోయారు. సాయి రెడ్డి రాజీనామా మీద కొన్నాళ్ళు చర్చ నడచింది. ఆయనను జగనే కావాలని బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నంలో ఇదొక భాగమని కూడా కొందరు అనుకున్నారు.
అయితే ఇటువంటి వాటి మీద ఫుల్ క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. అంతే కాదు విజయసాయిరెడ్డి పార్టీ వీడిపోవడం మీద ఆయన తనదైన శైలిలో స్పందించారు. సంచలనాత్మకమైన వ్యాఖ్యలే చేశారు. రాజకీయాల్లో ఉన్నామంటే వ్యక్తిత్వం విశ్వసనీయత ముఖ్యమని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు మనలను గమనిస్తారని ఆయన అన్నారు. ఎవరో ప్రలోభాలు పెడితేనో లేక భయపెడితోనో తగ్గి అటు వైపుగా మొగ్గితే ఇక ఏముంటుంది అని ఆయన ప్రశ్నించారు. సాయిరెడ్డి అయినా ముందు పోయిన ముగ్గురు అయినా లేదా రేపు వెళ్ళబోయే మరో ఒకరిద్దరిని అయినా చెప్పేది ఒక్కటే అని జగన్ అన్నారు. ప్రజలు గమనిస్తున్నారు అని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యం అంటేనే అయిదేళ్ళు. ఈ అయిదేళ్ళూ మనం సహనంతో ఓపిక పట్టి ఉండలేమా అని ఆయన ప్రశ్నించారు. నాయకుడు అంటే ఫలానా వారు అని జనాలు కాలరేగరేసేలా చెప్పుకునేలా ప్రవర్తన ఉండాలని జగన్ అన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని ఓపిక అన్నది రాజకీయాల్లో చాలా ముఖ్యమని జగన్ అన్నారు.
నిజానికి విజయసాయిరెడ్డి గత నెల 25న తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికి కరెక్ట్ గా చూస్తే పది రోజులు పైదాటి పోయింది. జగన్ రియాక్షన్ అయితే ఇప్పటిదాకా ఎక్కడా కనిపించలేదు. ఎట్టకేలకు మీడియా మాత్రం జగన్ నుంచి ఈ విషయాన్ని రాబట్టడానికి చూసింది. అయితే జగన్ దానికి ఇచ్చిన జవాబు చూస్తే విజయసాయిరెడ్డి విశ్వసనీయత విలువలు పట్టించుకోకుండా ప్రలోభాలకు లొంగి రాజీనామా చేసి వెళ్ళిపోయారు అన్నట్లుగా చెప్పారని అంటున్నారు.
నిజానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో జగన్ కి వైసీపీకి తీవ్రమైన షాక్ తగిలింది. అది జగన్ సాయిరెడ్డి గురించి చెబుతున్నపుడు కూడా ఇండైరెక్ట్ గా కొంత కనిపించింది. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా విషయాన్ని అందరి మాదిరిగానే జనరలైజ్ చేసి చెప్పడానికి జగన్ చూశారు అని అంటున్నారు. అంతే కాదు అందరి మాదిరిగానే ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడారని భావన వచ్చేలా మాట్లాడారు అని అంటున్నారు.
విలువలు విశ్వసనీయత అన్నది నాయకులకు ముఖ్యమని చెబుతూ జగన్ సాయిరెడ్డిని ఇండైరెక్ట్ గా కార్నర్ చేశారని అంటున్నారు. మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీకి బిగ్ షాక్ గానే ఉంది. దాని మీద వైసీపీ తట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తోంది.
ఆ సమయంలో ఈ ప్రశ్న ఎదురుకావడంతో సూటిగా స్పష్టంగానే విజయసాయిరెడ్డి పార్టీని కష్టకాలంలో వదిలి వెళ్ళిపోయారు అన్నట్లుగా మాట్లాడారు అంటున్నారు అంతే కాదు వైసీపీ ఎవరి దయ వల్లా లేదని దేవుడి దయ ప్రజల అభిమానంతోనే ఉందని జగన్ అనడం చూస్తే సాయిరెడ్డి కాదు ఎవరు బయటకు వెళ్ళినా ఏమీ కాదన్న సంకేతాలు ఇచ్చేశారు. మొత్తానికి వైసీపీ వారికి జగన్ రియాక్షన్ తో సాయిరెడ్డిని ఇక మీదట సోషల్ మీడియాలో తమదైన శైలిలో విమర్శించేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు.