Begin typing your search above and press return to search.

సర్వ నాశనం చేసిన వ్యవస్థ మీద మోజెందుకు జగన్ ?

వైసీపీ సర్వనాశనం అయింది అంటే దానికి ఉన్న ఎన్నో కారణాలలో రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థ కూడా చాలా ముఖ్య పాత్ర పోషించింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 10:30 PM GMT
సర్వ నాశనం చేసిన వ్యవస్థ మీద మోజెందుకు జగన్ ?
X

వైసీపీ సర్వనాశనం అయింది అంటే దానికి ఉన్న ఎన్నో కారణాలలో రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థ కూడా చాలా ముఖ్య పాత్ర పోషించింది. స్థానికంగా ఉన్న వారిని కాదని ఎక్కడ నుంచో ఒకరిని తెచ్చి పెట్టి వారి చేతికే సర్వాధికారాలు ఇవ్వడంతో లోకల్ లీడర్లు రగిలిపోయారు. ఇక క్యాడర్ కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు.

తమ ప్రాంతానికి సంబంధం లేని వారిని తెచ్చి పెట్టి సామాజిక సమీకరణలను సైతం పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. వచ్చిన వారు కూడా తగుదునమ్మా అని తమ శక్తి కొలదీ వాటం చూపించారు. దాంతో పార్టీ సర్వ భష్టత్వం అయింది. ఈ నేపథ్యంలో వైసీపీకి రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థ చేసిన చేటు అంతా ఇంతా కాదు అన్నది ఓటమి చెప్పిన పోస్టు మార్టం లో ఉంది.

ఇక దాని ఊసు వద్దు అని మొదట్లో అనుకున్నారు. వైసీపీలో ఉండేవారిని సీనియర్లను లోకల్ లీడర్లను సామాజిక సమతూకం పాటిస్తూ ఎంపిక చేయాలని కూడా నిర్ణయించారు. ఆ విధంగా జిల్లా అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ప్రతీ నియోజకవర్గం నుంచి కనీస రాష్ట్ర ఒక ఉపాధ్యక్షుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

అదే విధంగా వైసీపీలో కొత్తగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల నియామకం చేపడుతున్నారు దీని వల్ల కూడా ప్రతీ జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పార్టీ ప్రాతినిధ్యం రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ఇక నియోజకవర్గాలకు ఇంచార్జిలు ఉంటారు. అంతే కాదు జిల్లా అధ్యక్షులు సైతం ఉంటారు

ఫీడ్ బ్యాక్ తీసుకోవాలంటే వారి నుంచే వస్తుంది. పైగా వారు పక్కా లోకల్ గా ఉంటారు. దాంతో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ నేరుగా తెలుస్తాయి. కానీ రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థ అన్నది ఏర్పాటు చేయడం ద్వారా ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలను నలుగురైదుగురు నేతలతో కవర్ చేశామని అనుకోవచ్చు. వారితోనే మాట్లాడితే చాలు వారితోనే పార్టీ అంతా ఓకే అనుకుంటే అది అసలు కుదరదు అన్నదే వైసీపీకి లభించిన ఘోర ఓటమి రుజువు చేసింది అని గుర్తు చేస్తున్నారు

పైగా ఏ జిల్లాకు ఆ జిల్లాలో విభిన్న పరిస్థితులు ఉంటాయి. సామాజిక రాజకీయ నేపధ్యం ఉంటుంది. ఇక వీరంతా నేరుగా అధినేతకే తమ గోడు చెప్పుకుందామని చూస్తారు. అంతే తప్ప తమ మీద మరో వ్యవస్థను పెట్టి పెత్తనం చేయిస్తామంటే వారు ఊరుకోరు. పైగా ఆ వ్యవస్థను దాటి అధినేతని కలిసే వేలు లేకుండా పోవడానికి వారు అసలు జీర్ణించుకోలేరు.

ఈ రకంగా అతి పెద్ద గ్యాప్ వస్తుంది. అంతే కాదు తీవ్ర స్థాయిలో అసంతృప్తి కూడా చెలరేగుతుంది. ఇవన్నీ కూడా పార్టీ నిర్మాణాన్ని పటిష్టతను దెబ్బ తీస్తాయి. అచ్చంగా అదే గతంలో జరిగింది అని కూడా అంటున్నారు. చాలా మంది సీనియర్ నేతలే రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు.

కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం ఎందుకో మోజు పడుతోంది. ఏపీని నాలుగైదు రీజియన్లుగా చేసి ఉత్తరాంధ్రాకు విజయసాయిరెడ్డి గోదావరి జిల్లాలకు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మధ్య కోస్తా జిల్లాలైన గుంటూర్, ప్రకాశంలకు ఎంపీ మిధున్ రెడ్డి, క్రిష్ణా జిల్లాకు అయోధ్యా రామిరెడ్డి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప కర్నూల్, అనంతపురం జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డిలను నియమిస్తారని ప్రచారం అయితే సాగుతోంది.

దీని మీద వైసీపీ హై కమాండ్ సీరియస్ గానే ఉంది అని అంటున్నారు. అయితే రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం వద్దు అని పార్టీ లీడర్లు, క్యాడర్ గట్టిగానే అంటోంది. వైసీపీని ఓడించిన ఈ వ్యవస్థ అంటే అంత మోజు ఎందుకు అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థ మాత్రం ఒక విధంగా రచ్చ చేసేలాగానే కనిపిస్తోంది అని అంటున్నారు. మరి రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థ ఉంటుందా లేదా అన్నది కొద్ది రోజులలో తెలిసిపోతుంది అని అంటున్నారు.