నేరుగా ఫోన్ లోకి వస్తున్న జగనన్న...!
ఈ నేపధ్యంలో నేరుగా జగన్ లబ్దిదారుల ఫోన్లలోకి వస్తున్నారు.
By: Tupaki Desk | 22 March 2024 10:53 PM ISTఎన్నికల ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తోంది అధికార వైసీపీ. ఈసారి ఎన్నికలను సవాల్ గా తీసుకుంది. గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఈ నేపధ్యంలో నేరుగా జగన్ లబ్దిదారుల ఫోన్లలోకి వస్తున్నారు.
అంతే కాదు ఓటు ఉన్న ప్రతీ వారి మొబైల్ లోకి ఆయన వినిపిస్తున్నారు. ఏమిటి ఇది అంటే అదే అసలైన ఎన్నికల ప్రచారం అని అంటున్నారు. జగన్ సభలలో చేసిన ప్రసంగాలు అందులో ఆయన ప్రభుత్వం గురించి చెప్పిన మంచి విషయాలు ఇవన్నీ ది బెస్ట్ గా ఏర్చి కూర్చి వాయి మెసేజ్ ల కింద ప్రతీ ఓటరు కు మొబైల్ రూపంలో పంపిస్తున్నారు.
ఒక నంబర్ రింగ్ అవుతుంది. ఎత్తగానే అవతల వైపు నుంచి ఏకంగా జగన్ వాయిస్ తోనే మొదలవుతుంది. నాకు చంద్రబాబు లాగా 10 మంది సినిమా నటులు స్టార్ కాంపెయినర్స్ లేరు. మీడియా అండ లేనే లేదు. ఆకాశంలో నక్షత్రాల్లా మీరే స్టార్ కాంపెయినర్స్. నేను మీ బిడ్డను, అన్నను తమ్ముణ్ని. తోడుగా రావాలని ప్రజలకు పిలుపునిస్తున్నాను అని జగన్ తన వాయిస్తో అన్ని ఫోన్లకు మెసేజ్లకు పంపిస్తుండడం గమనార్హం.
ఇది గురువారం నుంచి ప్రచారంగా మొదలైపోయింది. జగన్ ఈ సరికొత్త ప్రచారానికి తెర తీసారు. ఇప్పటిదాకా టీవీలలో ప్రకటనల రూపంలో వైసీపీకి అనుకూలంగా వివిధ పధకాల మీద ప్రచారం చేశారు. ఎన్నికల కోడ్ మొదలు కావడంతో ఇపుడు కొంత ఇబ్బంది వస్తోంది. పరిమితంగానే ప్రచారం చేయాల్సి ఉంది. దాంతో ఇపుడు వైసీపీ మరో కొత్త వ్యూహానికి తెర తీసింది. అందుకే వాయిస్ మేసేజ్ ని జగన్ ఇస్తూ మొబైల్స్ లోనే వినిపిస్తున్నారు అని అంటున్నారు.
ఈ ప్రచారం ఇలా మొదలైందో లేదో అలా టీడీపీ సహా ఇతర విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల నియమావళికి ఇది పూర్తిగా విరుద్ధం అని అంటున్నారు. ఈ రకంగా వాయిస్ మెసేజ్ లను పంపించడం ఎన్నికల కోడ్ నిబంధనలను వ్యతిరేకించడం అవుతుందని అంటున్నారు. దీని మీద ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. తక్షణం ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిందే అని అంటున్నారు. మరి ఈసీ ఏమి చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా జగన్ వాయిస్ మెసేజ్ తో మొబైల్ ఫోన్ లోకి రావడం కొత్త ప్రచారమే అంటున్నారు.