Begin typing your search above and press return to search.

సామాజిక సాధికారతకు పెద్ద పీట వేసిన జగన్

వైసీపీ తాజాగా విడుదల చేసిన రెండవ జాబితాలో మొత్తం 27 మంది ఇంచార్జిలను ప్రకటించింది. ఈ మొత్తం లిస్ట్ కనుక ఒకసారి చూస్తే సామాజిక సాధికారతకు పెద్ద పీట వేసింది అని స్పష్టంగా అర్ధం అవుతోంది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 6:10 PM GMT
సామాజిక సాధికారతకు పెద్ద పీట వేసిన జగన్
X

వైసీపీ తాజాగా విడుదల చేసిన రెండవ జాబితాలో మొత్తం 27 మంది ఇంచార్జిలను ప్రకటించింది. ఈ మొత్తం లిస్ట్ కనుక ఒకసారి చూస్తే సామాజిక సాధికారతకు పెద్ద పీట వేసింది అని స్పష్టంగా అర్ధం అవుతోంది. కేవలం మాటలతో కాదు చేతలతో జగన్ తన సామాజిక న్యాయాన్ని చాటుకున్నారని అంటున్నారు.

ఈ రెండవ జాబితా కనుక చూస్తే సామాజిక సమీకరణల కోసం కొందరిని స్థాన చలనం కల్పించి మరి కొందరు కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు. అలాగే ఓసీలు ఉన్న చోట మైనారిటీలకు బీసీలకు కూడా అవకాశం కల్పించడం ద్వారా జగన్ అసలైన సామాజిక న్యాయం ఏంటి అన్నది రుజువు చేశారు.

మొత్తంగా చూస్తే కనుక ఈ రెండవ జాబితాలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బిసిలకు తగిన ప్రాధాన్యం కల్పించారు అని గట్టిగా చెప్పవచ్చు. అదే విధంగా వై నాట్ 175 అన్న నినాదంతో గెలుపు లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న వైసీపీ ఇంచార్జిల నియామకంలోనూ అన్ని రకాలైన జాగ్రత్తలను తీసుకుంది.

ఇక మార్చాల్సిన చోట పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమందిని స్థానాలు మార్చారు. అందులో భాగంగా కనుక చూసుకుంటే రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ను రాజమండ్రి సిటీకీ ఇంచార్జిగా చేశారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణను రామచంద్రాపురం నుండి రాజమండ్రి రూరల్ కు మార్పు చేశారు.

ఇక విజయవాడ పశ్చిమకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ కు మార్చారు. ఆయన స్థానంలో మైనార్టీకి చెందిన షేక్ ఆసిఫ్ కు అవకాశమిచ్చారు, అలాగే ఈసారి యువతకు పెద్ద పీట వేయడం జరిగింది. అలా కనుక చూసుకుంటే మచిలీ పట్నం నుండి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్టమూర్తికి, చంద్రగిరి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి , రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు అవకాశం కల్పించారు. పోలవరం నుండి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశమిచ్చారు.

మరో వైపు చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ పిఠాపురం నుండి వంగ గీత,జగ్గంపేట నుండి తోట నరసింహం,ప్రత్తిపాడు నుండి వరుపుల సుబ్బారావులకు అవకాశం కల్పించారు. ఇక మైనార్టీలకు కూడా ప్రాధాన్యత నిస్తూ విజయవాడ వెస్ట్ నుండి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ నుండి షేక్ నూరి ఫాతిమా, కదిరి నుండి బియస్.మక్బూల్ అహ్మద్ లకు అవకాశం కల్పించారు.

ఈ విధంగా చూస్తే కనుక ఎస్పీ సామాజిక వర్గం నుండి పాయకరావు పేట నుండి కంబాల జోగులు, పి.గన్నవరం నుండి విప్పర్తి వేణుగోపాల్, ఎర్రగొండపాలెం నుండి తాటిపర్తి చంద్రశేఖర్ లకు అవకాశం కల్పించారు. ఎస్టీ సామాజికవర్గం నుండి అరకు ఎంపీ స్థానానికి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి లకు అవకాశం కల్పించారు.

బిసి సామాజిక వర్గం నుండి మార్గాని భరత్, మలసాల భరత్ కుమార్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పిల్లి సూర్యప్రకాష్ లకు అవకాశం కల్పించారు. వైశ్య సామాజిక వర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ కు అవకాశమిచ్చారు. అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తూ సామాజిక న్యాయం పాటిస్తూ వైసీపీ రెండవ జాబితా విడుదల చేశారు అని చెప్పాలి.

మొదటి విడత జాబితాలో పదకొండు స్థానాలకు ఇంచార్జిలను నియమించినపుడు కూదా సామాజిక న్యాయాన్ని కచ్చితంగా పాటించారు. ఇపుడు రెండు జాబితాలు కలుపుకుని మొత్తం మొత్తం 38 మందిని నియమించారు. దీనిలో కనుక చూసుకుంటే అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ మార్పులు చేసినట్లుగా అర్ధం అవుతోంది.

ఎక్కడా కూడా సామాజిక సూత్రాన్ని తప్పకుండా ఈ విధంగా గెలుపు గుర్రాలను సమర్ధులను యువతను మహిళలను కలుపుకుంటూ జాబితాను తీసుకుని రావడం ఒక్క జగన్ కే చెల్లిందని వైసీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.