Begin typing your search above and press return to search.

ఈ ఎన్నిక‌లు.. నాకు-చంద్ర‌బాబుకు మ‌ధ్య కాదు: జ‌గ‌న్

ప్ర‌స్తుతం ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటుఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రో 15 రోజుల్లోనే నోటిఫికేష‌న్ రానుంది

By:  Tupaki Desk   |   3 April 2024 3:31 PM GMT
ఈ ఎన్నిక‌లు.. నాకు-చంద్ర‌బాబుకు మ‌ధ్య కాదు:  జ‌గ‌న్
X

ప్ర‌స్తుతం ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటుఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రో 15 రోజుల్లోనే నోటిఫికేష‌న్ రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికేప్ర‌ధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు ప్ర‌చారం ప్రారంభించాయి. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పూత‌ల‌ప‌ట్టులో ప‌ర్య‌టించి.. 'మేం సైతం సిద్ధం' స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత ఎన్నిక‌లు.. త‌న‌కు-చంద్ర‌బాబుకు మ‌ధ్య జ‌రుగుతున్న‌వి కావ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల ల‌క్ష్యం ఏంటో కూడా జ‌గ‌న్ చెప్పారు.

''ఈ ఎన్నికలు జగన్ కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబా బుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ.. ప్రజల పక్షాన ఉన్నానని చెప్పడానికి గర్విస్తున్నా. ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి.. ఓ దత్తపుత్రుడు, ఓ ఎల్లో మీడియా అంటే ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ(కాంగ్రెస్‌), ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ(బీజేపీ). వీళ్లందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర ప్రజల పక్షం... వీరిది చంద్రబాబు పక్షం. వీరందరూ యుద్ధానికి వస్తున్నారు'' అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం ఒక వైపున ఉన్నాయ‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరో వైపున ఉన్నాయ‌న్నారు. ''మంచి ఓ వైపున, చెడు ఓ వైపున.. వెలుగు ఒక వైపున, చీకటి మరో వైపున... ధర్మం ఒకవైపున, అధర్మం మరో వైపున ఉన్నాయి'' అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ రెండు ప్రత్యామ్నాయాల గురించి ప్రతి ఇంట్లోనూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ''అధికారాన్ని ఉపయోగించి ప్రతి ఇంటా సంక్షేమం వెల్లివిరిసేలా చేసిన మన ప్రభుత్వ ఒకవైపున ఉంది. గతంలో మూడుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ, అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి... వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్టుగా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున ఉంది'' అని జ‌గ‌న్ కొత్త భాష్యం చెప్పారు.

పాత పాటే..

ఇక‌, త‌న ప్ర‌సంగంలో జ‌గ‌న్ పాత పాటే పాడారు. ''మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా మీ బిడ్డకు మీరు తోడుగా నిలవాలి. ఈసారి ఏకంగా 175కి 175 అసెంబ్లీ స్థానాలు, ఏకంగా 25కి 25 లోక్ సభ స్థానాలు గెలిపించుకుని పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబుల్ సెంచరీ సర్కారును సాధించేందుకు మీరంతా సిద్ధమేనా?'' అని గ‌త నాలుగు రోజులుగా అడుగుతున్న ప్ర‌శ్న‌లే ఇక్క‌డా సంధించారు. మీరు వేసే ఓటుతో ఐదేళ్ల జీవితం ప్రభావితమవుతుందని ప్ర‌జ‌ల‌కు చెప్పారు. అంతేకాదు, మీరు వారికి ఓటేస్తే 1825 రోజులు మీ భవిష్యత్ ను వాళ్ల చేతిలో పెట్టినట్టేన‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.