Begin typing your search above and press return to search.

పిఠాపురంలో బాబు సంకలో పిల్లి... పవన్ పై జగన్ నాన్ స్టాప్ పంచులు!

ఈ సందర్భంగా... పెళ్లికి పిఠాపురం వెళ్తూ పిల్లిని చంకనపెట్టుకుని వెళ్లాడని ఒక సామెత ఉందని మొదలుపెట్టిన జగన్... చంద్రబాబు తన సంకలో ఉన్న పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వాదిలాడని..

By:  Tupaki Desk   |   19 April 2024 1:44 PM GMT
పిఠాపురంలో బాబు సంకలో పిల్లి... పవన్  పై జగన్  నాన్  స్టాప్  పంచులు!
X

"మేమంతా సిద్ధం" బస్సు యాత్ర 18వ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ, అచ్చంపేట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్. కులాన్ని హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేయగలననే భ్రమలో పవన్ ఉన్నారంటూ నిప్పులు చెరిగారు.

అవును... తాజాగా "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో భాగంగా కాకినాడ జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్... పవన్ కు ఎన్ని టిక్కెట్లు ఇవ్వాలో, ఎక్కడెక్కడ ఇవ్వాలో, ఆయాస్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలో, ఆఖరికి దత్తపుత్రుడు కూడా ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే ఫిక్స్ చేసిన కూటమి ఇదని తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో పవన్ ఉన్నారని అన్నారు.

80 సీట్లు కాదు.. 20 సీట్లు ఇస్తామన్నా కూడా జీ హుజూర్ అనడమే దత్తపుత్రుడి పరిస్థితి అని జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే... కులాన్ని హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేయగలనన్న భ్రమతో పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో పవన్ కు రాష్ట్రం అంతే ఎంతచులకనంటే అని మొదలుపెట్టిన జగన్... అతడికి జ్వరం వస్తే పిఠాపురాన్ని వదలి హైదరాబాద్ వెళ్లిపోయేటంత చులకన అని అన్నారు.

ఇంతకు ముందు పవన్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక అనే మూడు నియోజకవర్గాలుంటే.. ఇప్పుడు పిఠాపురం నాలుగోదని చెప్పిన జగన్... ఈ మ్యారేజీ స్టార్ కు ఏ ప్రాంతమన్నా ప్రేమ ఉండదు, ఏ భార్య అన్నా ప్రేమ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో... పెళ్లిల్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగేసి అయ్యాయి అంటూ జగన్ ఎద్దేవా చేశారు!

ఈ సందర్భంగా... పెళ్లికి పిఠాపురం వెళ్తూ పిల్లిని చంకనపెట్టుకుని వెళ్లాడని ఒక సామెత ఉందని మొదలుపెట్టిన జగన్... చంద్రబాబు తన సంకలో ఉన్న పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వాదిలాడని.. ఇది గాజు గ్లాసు పరిస్థితి అని జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఈ క్రమంలోనే ఆ గాజు గ్లాసులో గట గటా తాగేది మాత్రం చంద్రబాబే కానీ.. ఆ తర్వాత దాన్ని కడిగి, శుభ్రం చేసి ఇచ్చేది మాత్రం పవన్ కల్యానే అని ఎద్దేవా చేశారు.