Begin typing your search above and press return to search.

అటు ఇటు యుద్ధాలు.. పనికిరాని సరుకులా ఐక్యరాజ్య సమితి

ఐక్యరాజ్య సమితి విషయంలో ఇప్పటికో ఎన్ని విమర్శలున్నాయి. అది అమెరికా చెప్పినట్లు నడుచుకుంటుందనే ఆరోపణలున్నాయి.

By:  Tupaki Desk   |   7 Oct 2024 8:30 PM GMT
అటు ఇటు యుద్ధాలు.. పనికిరాని సరుకులా ఐక్యరాజ్య సమితి
X

ఐక్యరాజ్య సమితి విషయంలో ఇప్పటికో ఎన్ని విమర్శలున్నాయి. అది అమెరికా చెప్పినట్లు నడుచుకుంటుందనే ఆరోపణలున్నాయి.

రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విధ్వంసంతో బుద్ధి తెచ్చుకుని.. మరో (మూడో) ప్రపంచ యుద్ధం రాకుండా చూసేందుకు.. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1945లో ఏర్పడింది ఐక్యరాజ్యసమితి (ఐరాస). 193 దేశాలు పూర్తి కాల సభ్య దేశాలుగా ఉండగా.. వాటికన్, స్టేట్ ఆఫ్ పాలస్తీనా (ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న గాజా కూడా ఇందులోదే) దేశాలు సభ్యత్వం లేకుండా కొనసాగుతున్నాయి. శక్తిమంతమైన భద్రతా మండలి సహా ఆరు విభాగాలున్న ఐక్యరాజ్య సమితి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..

అసలు ఉందా లేదా?

రెండున్నరేళ్లుగా జరుగుతోంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం. వీటిలో రష్యా.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశం. అంటే వీటో పవర్ ఉన్న దేశం. భద్రతామండలి శాశ్వత సభ్య దేశాల్లో ఒక దేశం వీటో చేస్తే ఆ తీర్మానం ఆమోదం పొందదు. కాగా, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ శాశ్వత సభ్య దేశాల హోదా పొందాయి. భారత్ కు 75 ఏళ్లు అవుతున్నా ఈ సభ్యత్వం రాలేదు. తాత్కాలిక శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. దాని గడువు ముగిసింది. కాగా, ఐదు శాశ్వత సభ్య దేశాల్లో చైనా తప్ప మిగతా మూడూ రష్యాను వ్యతిరేకించేవే. అంతేగాక ఉక్రెయిన్ కు ఆయుధాల సాయం చేస్తున్నాయి.

ఈ యుద్ధంలో ఏం చెబుతుంది?

ఓవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎడతెగకుండా సాగుతుంటే.. మరోవైపు ఏడాది నుంచి గాజా (హమాస్)-ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తోంది. వాస్తవానికి గాజా అంటే పాలస్తీనాలో భాగమే. కానీ, అది సొంత పాలకమండలిని ఏర్పాటు చేసుకుంది. హమాస్ లకు అడ్డాగా మారింది. మరోవైపు హెజ్బొల్లాల అడ్డా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్.. ఇజ్రాయెల్ మీదకు దూకుతోంది. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ స్పందన ఏమిటన్నది చూడాల్సి ఉంది. ఏడుగురితో తాము యుద్ధం చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. ఇక ఇది దాదాపు ఓ ప్రాంతీయ యుద్ధమే. మరి ఇంత జరుగుతుంటే ఐక్య రాజ్య సమితి ఏం చేస్తున్నది?

జై శంకర్ సరైన ప్రశ్న..

ఐక్యరాజ్య సమితి విషయంలో ఇప్పటికో ఎన్ని విమర్శలున్నాయి. అది అమెరికా చెప్పినట్లు నడుచుకుంటుందనే ఆరోపణలున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఐక్యరాజ్య సమితి పనితీరు సహా పలు అంశాలపై మాట్లాడారు. సమితిపై అయితే సంచలన వ్యాఖ్యలే చేశారు. దానిని.. మార్కెట్‌ లో మనుగడ లేని పాత వ్యాపారగా అభివర్ణించారు. ప్రపంచంలో రెండు యుద్ధాలు జరుగుతుంటే సమితి ప్రేక్షక పాత్రకే పరిమితమైందని విమర్శించారు. సంక్షోభాలను పరిష్కరించేందుకు ఐరాస ఏమీ చేయలేకపోతోందని పేర్కొన్నరు. అంతేకాకుండా.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలో మార్పులు లేవని.. వ్యాపార ప్రపంచంలో స్టార్టప్‌ కంపెనీల తరహాలో ఐరాస ముందుకు సాగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.