జనసేన ప్లీనరీ.. బిగ్ చేంజ్ ఎందుకలా ?
ఈ నేపధ్యంలో జనసేన ఆవిర్భావ సభలు వచ్చాయి. మార్చి 14న జనసేన వ్యవస్థాపక దినోత్సవం. ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే జనసేన అధికారంలో ఉండడం.
By: Tupaki Desk | 17 Feb 2025 7:30 PM GMTజనసేన ఏపీలో మూడో ఫోర్స్ గా ఎదుగుతున్న రాజకీయ పార్టీ. చాలా వేగంగా జనసేన ఎదుగుతోంది. దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్లామర్ తో పాటు ఆయన నాయకత్వం పట్ల ఒక బలమైన సామాజిక వర్గంలో పెరిగిపోతున్న ఆశలు అలాగే అన్నిటికీ అతీతంగా యువత మహిళల నుంచి పూర్తి మద్దతు జనసేనకు దక్కడం వంటివి ఉన్నాయి.
జనసేన ఈ రోజు ఈ స్థితికి పవన్ కళ్యాణ్ బలమైన సంకల్పమే ప్రధాన కారణం. అంతే కాదు ఆయన రాజకీయంగా పట్టిన ఓపిక. సహనం, అలాగే ఆయన ఎంచుకున్న వ్యూహాలు ఇవన్నీ కలసి వచ్చి 2024 ఎన్నికల్లో సెంట్ పెర్సెంట్ స్ట్రైక్ రేట్ తో జనసేన ఘన విజయాన్ని సాధించింది. దాంతో జనసేన భవిష్యత్తు పట్ల నమ్మకం రాజకీయ వర్గాలలో బాగా పెరుగుతోంది. జనసేనకు రేపటి రోజులు బంగారం అన్న ధీమా కూడా ఏర్పడుతోంది.
ఈ నేపధ్యంలో జనసేన ఆవిర్భావ సభలు వచ్చాయి. మార్చి 14న జనసేన వ్యవస్థాపక దినోత్సవం. ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే జనసేన అధికారంలో ఉండడం. దాంతో మూడు రోజుల పాటు ధూం ధాం గా నిర్వహిస్తారని మొదట్లో ప్రచారం సాగింది. మార్చి 12 నుంచి 14వ తేదీ వరకూ జనసేన ప్లీనరీ సాగుతుందని కూడా అనుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని ఈ సందర్భంగా కీలక చర్చలతో పాటు భవిష్యత్తు మీద దిశా నిర్దేశం అధినేత హోదాలో పవన్ చేస్తారు అని ప్రచారం సాగింది. అయితే లేటెస్ట్ గా వచ్చిన ప్రకటన చూస్తే కనుక జనసేన ప్లీనరీ ఒక రోజే అని అంటున్నారు. ఈ నెల 14న బహిరంగ సభ ఉంటుందని పవన్ ఆ సభలో ప్రసంగిస్తారని అంటున్నారు. ఈ సభతో జనసేన ప్లీనరీ ముగుస్తుందని అంటున్నారు.
మరి ఒక్క రోజుకే జనసేన ప్లీనరీ పరిమితం కావడం అన్నది బిగ్ చేంజ్. ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అన్నది చర్చగా ఉంది. జనసేన ప్లీనరీ మీద రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న నేపథ్యం ఒక వైపు ఉంది. జనసేన అధినాయకత్వం పార్టీకి ఇచ్చే సూచనలు కార్యాచరణ ఏమిటి అన్నది కూడా అంతా చర్చించుకుంటూ వచ్చారు. గత నెలలో జనసేన విడుదల చేసిన ఒక ప్రకటనలో కూడా అన్ని విషయాలూ సమగ్రంగా జనసేన ప్లీనరీలో చర్చించుకుందామని పేర్కొన్నారు.
మరి ఇపుడు పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందా లేదా అన్నది చర్చకు వస్తోంది. అయితే మార్చి 14న ఉదయం ప్రజా ప్రతినిధుల సభ నిర్వహించి సాయంత్రం బహిరంగ సభ నిర్వహించవచ్చు అన్న ప్రచారం సాగుతోంది. అయితే మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహిస్తే పూర్తి స్థాయిలో పార్టీ పండుగను అంతా ఎంజాయ్ చేస్తారు అని అంటున్నారు. మరి జనసేన ప్లీనరీ ఒక రోజేనా లేక మూడు రోజులూ ఉండొచ్చా అన్నది ఇప్పటికీ చర్చగానే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. తాజాగా వచ్చిన ప్రకటన చూస్తే కనుక జనసేన బహిరంగ సభ 14న జరుగుతుంది అని ఉంది.