Begin typing your search above and press return to search.

కూటమికి కొత్త టెన్షన్... గ్లాసు గుర్తుపై బిగ్ ట్విస్ట్!!

జనసేన బరిలో ఉన్నచోటే ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు దక్కనుంది. మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లకు దక్కనుంది!

By:  Tupaki Desk   |   21 April 2024 6:26 AM GMT
కూటమికి కొత్త టెన్షన్... గ్లాసు గుర్తుపై బిగ్ ట్విస్ట్!!
X

ఆంధ్రప్రదేశ్ లో అసలు సిసలు ఎన్నికల సందడి మొదలైపోయింది. మొన్నటివరకూ సైలంటు గా ఉన్నట్లు కనిపించిన ఎన్నికల వాతావరణం నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత మరింత వేడెక్కడం మొదలైంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కూటమికి కొత్త సమస్య ఏర్పడింది. జనసేన బరిలో ఉన్నచోటే ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు దక్కనుంది. మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లకు దక్కనుంది!

అవును... ఏపీలో బీజేపీ - టీడీపీ - జనసేన కూటమిగా ఏర్పడగా... ఈ సమయంలో జనసేన తరుపున కూటమికి కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ఇది ఇప్పుడు జనసేన పోటీ చేసే స్థానాల్లో మినహా.. మిగిలిన చోట్ల సమస్యగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన తెరపైకి వచ్చీంది. వాస్తవానికి జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇవ్వడాన్ని హైకోర్టు అనుమతించింది. ఆ తర్వాతే మరో సమస్య తెర మీదకు వచ్చింది.

ఇందులో భాగంగా... ఏపీలో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయిస్తారు. మిగిలిన 144 అసెంబ్లీ, 23 లోక్ సభ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా కోరుకుంటే వారికి ఈ గుర్తు ఇచ్చే అవకాశం ఉంది. కారణం... ఇండిపెండెంట్లు కోరుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఫ్రీ సింబల్స్‌ లో గాజు గ్లాసు గుర్తు కూడా ఉండటమే!

దీంతో... ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు లేని అన్ని స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కోరితే ఈ గుర్తు కేటాయిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో... జనసేన అభ్యర్థులు లేని 144 + 23 చోట్ల గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు కేటాయిస్తే తాము నష్టపోతామని ఈ రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ గుర్తు చూసిన కొంతమంది... పొరపాటున స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు వేస్తే తమకు రావలసిన ఓట్లు తగ్గిపోతాయని అంటున్నారు.

ఇదే క్రమంలో... కూటమికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ.. జనసేన పోటీ లేని స్థానాల్లో తమకు కావలసిన వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి, వారికి గాజు గ్లాసు గుర్తు దక్కించుకుంటే నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. పైగా ఈ సారి భారీ మెజారిటీలు దాదాపుగా కష్టం అని.. గరిష్టంగా 2 - 5 వేల లోపు మెజారిటీలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్న సమయంలో... ఈ గాజు గుర్తు ఇండిపెండెంట్లు కూటమికి కలిగించే డ్యామేజ్ భారీగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో రాబోయేది పెద్ద సమస్యే.. జరగబోయేది పెద్ద డ్యామేజే అని ఆందోళనలు తెరపైకి వస్తున్నాయి. దీంతో... ఈ సమస్యను ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారట జనసేన నాయకులు. అయితే దీనికి సంబంధించిన సీఈసీ నిర్ణయం వెలువడాల్సి ఉంది. దీంతో.. ఇప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్దులకు కేటాయించకుండా నిర్ణయం తీసుకుంటుందా.. లేక, జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట ఫ్రీ సింబల్ గానే ఉంచుతుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది!