Begin typing your search above and press return to search.

బాబు, పవన్ కు జోగయ్య మరో జాబు... జవాబు వైట్ పేపర్!

ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో బహిరంగ లేఖల ప్రస్థావన వస్తే ముందుగా గుర్తుకు వచ్చే పేరు చేగొండి హరిరామజోగయ్య అని చెప్పినా అతిశయోక్తి కాదేమో.

By:  Tupaki Desk   |   15 March 2025 2:16 PM IST
బాబు, పవన్  కు జోగయ్య మరో జాబు... జవాబు వైట్  పేపర్!
X

ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో బహిరంగ లేఖల ప్రస్థావన వస్తే ముందుగా గుర్తుకు వచ్చే పేరు చేగొండి హరిరామజోగయ్య అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో 2024 ఎన్నికలకు ముందు నుంచీ ఆయన వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. తొలుత టీడీపీతో జనసేన పొత్తు, ఆ సమయంలో పవన్ డిమాండ్ చేయాల్సిన సీట్ల సంఖ్య వరకూ ఆయన తన లేఖల్లో సూచించేవారు.

ఆయన సూచనలు ఏవీ జనసేన పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించకపోయినా.. జోగయ్య మాత్రం లేఖలు రాయడం ఆపడం లేదు! ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జోగయ్య ఓ లేఖ రాశారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి తర్వాత ఆ లేఖ విడుదల చేశారు. అందులో ప్రధానంగా కాపు రిజర్వేషన్స్ గురించి ప్రస్తావించారు.

ఈ సందర్భంగా... గతంలో చంద్రబాబు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరారు. గతంలో తాను ఈ విషయంపై నిరాహార దీక్ష చేసినప్పుడు ఈ అంశంపై కలిసి పని చేద్దామని, దీక్ష విరమించాలని తనకు ఇచ్చిన మాటను పవన్ నిలబెట్టుకోవాలని జోగయ్య లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా మరో లేఖ రాశారు.

అవును... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు హరిరామ జోగయ్య తాజాగా ఓ బహిరంగ లేఖ రాశారు. ఇందులో భాగంగా... కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.50,000 కోట్లు ఖర్చు చేశారని రాసుకొచ్చారు.

ఇదే సమయంలో... మరో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా సిద్ధం అవుతున్నారని తెలిపారు. అయితే... ఆఫీసులు, అసెంబ్లీ, మండలి, హైకోర్టు వంటి వాటికోసం ఖర్చు చేయడం మంచిదే కానీ... మిగతా వాటి సంగతి ఏమిటనేది కూడా మరింత ముఖ్యమని చెబుతూ.. పలు ప్రశ్నలు సంధించారు మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య.

ఇందులో భాగంగా... వారాహి సభలో ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటానని పవన్ చెప్పారని.. ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాల్లోనూ అభివృద్ధికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉందని లేఖలో కోరారు జోగయ్య. ఇందులో భాగంగా.. విద్య, వైద్యం, రోడ్లు, వ్యాపారం, వ్యవసాయం, సాగు నీరు, తాగు నీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వల్సిన అవసరం ఉందని అన్నారు.

ఏళ్ల తరబడి సమగ్ర అభివృద్ధికి నోచుకోని గోదావరి జిల్లాలకు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి పథకాలకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో.. ప్రతీ ఏటా ప్రతీ జిల్లాకు చేసిన ఖర్చులపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలు సంతోషిస్తారని ఆ లేఖద్వారా సీఎం, డిప్యూటీ సీఎంలకు జోగయ్య కోరారు!