Begin typing your search above and press return to search.

తిన్నామా.. పడుకున్నామా? అసెంబ్లీకొచ్చామా?

కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఎమ్మెల్యేల గైర్హాజరు పెరుగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సభలో పాల్గొనే ఎమ్మెల్యేలు, భోజన విరామం అనంతరం తిరిగి రాకుండా పోతున్నారు.

By:  Tupaki Desk   |   26 Feb 2025 10:30 AM GMT
తిన్నామా.. పడుకున్నామా? అసెంబ్లీకొచ్చామా?
X

‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ అదేదో సినిమాలో చెప్పిన డైలాగ్ లాగే ఉంది ఇప్పుడు కర్ణాటకలోని ఎమ్మెల్యేల పరిస్థితి. ప్రజా సమస్యలు ప్రస్తావించే కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మధ్యాహ్నం తిని పడుకోవడానికి ఏర్పాట్లు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం తిన్నాక ఎవరూ అసెంబ్లీకి రావడంలేదని గ్రహించిన స్పీకర్.. ఏకంగా అసెంబ్లీలోనే పాన్పులు ఏర్పాటు చేసిన వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఎమ్మెల్యేల గైర్హాజరు పెరుగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సభలో పాల్గొనే ఎమ్మెల్యేలు, భోజన విరామం అనంతరం తిరిగి రాకుండా పోతున్నారు. దీనివల్ల ముఖ్యమైన చర్చలు జరగడం లేదు, బిల్లుల ఆమోద ప్రక్రియ అంతరాయానికి గురవుతోంది. ఈ సమస్య పరిష్కారానికి అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

-అసెంబ్లీలో కొత్త మార్పులు

సభ్యులు భోజనం అనంతరం విశ్రాంతి అవసరమని గుర్తించిన స్పీకర్, అసెంబ్లీలో రిక్లైనర్లు ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యేలు సభ ప్రాంగణంలోనే విశ్రాంతి తీసుకుని, తిరిగి చర్చలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మార్చి 3 నుండి 21 వరకు జరిగే సమావేశాల్లో ప్రయోగాత్మకంగా 15 రిక్లైనర్లు అద్దెకు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.

-రిక్లైనర్ల ప్రత్యేకతలు

రిక్లైనర్లు సాధారణ సోఫాల కంటే మెత్తగా ఉంటాయి. వీటిలో అధికంగా దూదిని ఉపయోగించడం వల్ల అవి మరింత సౌకర్యంగా ఉంటాయి. వీటిని పుష్ బ్యాక్ చేయడం ద్వారా వీరి శరీరానికి ఉపశమనాన్ని కలిగించే విధంగా రూపొందించబడ్డాయి. దీని వల్ల నడుం నొప్పి సమస్య తక్కువగా ఉండటంతో పాటు, సభ్యులకు విశ్రాంతి కూడా లభిస్తుంది.

-ప్రజా సంఘాల విమర్శలు

అయితే ఎమ్మెల్యేలకు రిక్లైనర్ల అవసరం ఉందా అనే ప్రశ్న కూడా లేచింది. ప్రజాసంఘాల నాయకులు విమర్శిస్తూ, భోజనం అనంతరం కునుకు తీసే స్థాయిలో ఉన్న వారిని ప్రజా ప్రతినిధులుగా ఎందుకు ఎన్నుకోవాలి? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాసమస్యలను పట్టించుకోవాల్సిన స్థానంలో విశ్రాంతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడాన్ని సమర్థించలేమని అంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు పెంచేందుకు తీసుకున్న ఈ కొత్త చర్య ఎంతవరకు ఫలితమిస్తుందో చూడాలి. రిక్లైనర్ల వినియోగం ద్వారా సభ్యుల హాజరు పెరుగుతుందా? లేక ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటారా? అనేది సమయం చెబుతుంది. ప్రస్తుతానికి 15 రిక్లైనర్లతో ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలను అందిస్తే, భవిష్యత్తులో శాశ్వతంగా రిక్లైనర్లు ఏర్పాటు చేసే అవకాశముంది.