Begin typing your search above and press return to search.

కేసీయార్ సైలెంట్ వెనక వైలెంట్ గేమ్ ప్లాన్...?

కేసీయార్ అంటేనే వ్యూహాల పుట్ట. అపర చాణక్యం ఆయన సొంతం. మాటల మాత్రికుడిగా పేరు. అలాంటి కేసీయార్ తెలంగాణా లో ఎన్నికలు దగ్గర లో పడినా కూడా పెద్దగా సౌండ్ చేయడంలేదు.

By:  Tupaki Desk   |   3 Aug 2023 9:57 AM GMT
కేసీయార్  సైలెంట్  వెనక వైలెంట్ గేమ్ ప్లాన్...?
X

కేసీయార్ అంటేనే వ్యూహాల పుట్ట. అపర చాణక్యం ఆయన సొంతం. మాటల మాత్రికుడిగా పేరు. అలాంటి కేసీయార్ తెలంగాణా లో ఎన్నికలు దగ్గర లో పడినా కూడా పెద్దగా సౌండ్ చేయడంలేదు. ఆ మాటకు వస్తే అసలు తెలంగాణాలోనే పెద్దగా ఉండడంలేదు ఆయన బీయరెస్ పార్టీ విస్తరణ అంటూ దేశమంతా తిరుగుతున్నారు.

మహారాష్ట్రా ఎన్నికలు 2024 అక్టోబర్ లో ఉంటే అక్కడకు వెళ్లి కేసీయార్ బిగ్ సౌండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో సభలు సమావేశాలతో టైం పాస్ చేస్తున్నారు. అదే విధంగా ఢిల్లీ రాజకీయాల మీద ఫోకస్ పెంచుతున్నారు. మోడీ సర్కార్ మీద అవిశ్వాసం పెట్టడంతో పాటు మోడీ ప్రభుత్వం మీద ఏ కూటమితో సంబంధం లేకుండా పోరాడుతామని చెబుతున్నారు.

అయితే తెలంగాణా రాజకీయం మారుతోంది. పూటకో బడా నేత వేళ్ళి కాంగ్రెస్ లో కలుస్తున్నారు. బీయారెస్ గెలవదు అంటూ ఆ నేతలే చెబుతున్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు అయితే మామూలుగా లేదు, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణా రావు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా కేసీయార్ ని కాస్తా చార్లెస్ శోభారాజ్ శిష్యుడు అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

బీజేపీ కూడా తెలంగాణాలో విస్తరించాల ని తాపత్రయపడుతోంది. అందరి చూపూ కేసీయార్ మీదనే. ఒక మాట అని పది మాటలు అనిపించుకుని మళ్లీ దానికి వడ్డీ చెల్లించాలని విపక్షాలు ఆరాటపడుతూంటే కేసీయార్ నుంచి మాత్రం నో సౌండ్ అన్నట్లుగా సీన్ ఉంది. ఇక ఎన్నికలు దగ్గరపడుతూంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి చర్యలతో బీయారెస్ చాలా సైలెంట్ గా తన పని తాను కానిచ్చేస్తోంది.

సౌతిండియలో తొలి హ్యాట్రిక్ సీఎం కేసీయార్ అని మంత్రి కేటీయార్ అంటున్నారు. బీయారెస్ గెలిచి తీరుతుందని చెబుతూ కేటీయార్ మాట్లాడుతున్నారు కానీ కేసీయార్ మాత్రం నోరు విప్పడంలేదు. అయితే కేసీయార్ సైలెంట్ ఎందుకు దాని వెనక ఏముంది అన్నదే ఇపుడు రాజకీయ విశ్లేషకుల కు సైతం అర్ధం కావడంలేదు

అయితే కేసీయార్ మాట్లాడినా సైలెంట్ గా ఉన్నా కూడా అది కూడా వ్యూహమే అని అంటున్నారు. కేసీయార్ ఇపుడు సైలెంట్ గా ఎందుకు ఉన్నారంటే దానికి కూడా అర్ధాలు పరమార్ధాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. ఇపుడు కనుక కాంగ్రెస్ మీద కానీ బీజేపీ మీద కానీ సెటైర్లు వేసినా లేక కౌంటర్లు వేసినా అటు వైపు నుంచి భారీ ఎత్తున ఎన్ కౌంటర్లు రెడీగా ఉంటాయి.

అలా వారూ వీరూ అన్నట్లుగా పోటీ నడుస్తుంది. మాటల తూటాలు వాడిగా వేడిగా పేలుతాయి. ఈ సందట్లో విపక్షాలు ఒక్క సారిగా హైలెట్ అవుతాయి. జనం లో వారి విషయం చర్చగా వస్తుంది. అందుకే కేసీయార్ ఇవన్నీ గమనించే తెలంగాణాలో పొలిటికల్ హీట్ పెరగకుండా చూసుకుంటున్నారు అని అంటున్నారు.

అధికారం లో ఉన్న బీయారెస్ కనుక ఒక మాట అంటే అది కచ్చితంగా హైలెట్ అయి తీరుతుంది. దానికి కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కౌంటర్లు వస్తే ఇక రచ్చ మామూలుగా ఉండదు. అలా విపక్షాల కు హైప్ క్రియేట్ అయి వారు రేసులో ముందుకు వస్తున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే తెలివిగా తెలంగాణా రాజకీయాల ను ఏ మాత్రం కెలకకుండా కేసీయార్ పూర్తిగా వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటిస్తున్నారు అని అంటున్నారు.

దీని వల్ల తెలంగాణాలో ప్రతిపక్షాల అలికిడి సహజంగా ఎంతో కొంత తగ్గుతుంది. వారు ఎన్ని విమర్శలు చేసినా కూడా వన్ సైడెడ్ గానే ఉంటాయి. ఒంటి చేతి చప్పట్లుగా మిగిలిపోతాయి. అలా చప్పబడిపోతాయి. చడీ చప్పుడు లేకుండా జనం మైండ్ లోకి రాకుండా ఏమీ కాకుండా అలాగే గాలిలో కలసి ఆవిరై పోతాయి.

సరిగ్గా ఇదే ప్లాన్ తో కేసీయార్ సైలెంట్ గా ఉన్నట్లుగా చెబుతున్నారు. అంటే తన మాటల వల్ల విమర్శల వల్ల కూడా ఏ మాత్రం విపక్షాల గ్రాఫ్ పెరగకూడదు వారి ఉనికి అన్నదే పెద్దగా వెలుగులోకి రాకూడదు అనే బ్రహ్మాండమైన ఎత్తుగడలోనే కేసీయార్ కోరి మరీ మౌనాన్ని పాటిస్తున్నారు అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల తెలంగాణా రాజకీయాల్లో వేడి పెద్దగా ఉండదు. జనాలలో కూడా మళ్లీ బీయారెస్ అధికారంలోకి వస్తుందన్న భావన మిగిలిపోతుంది. ఇదే జరగాలని ఇలాగే కావాలని కేసీయార్ ఎత్తుగడల లో ఉన్నారని అంటున్నారు.