Begin typing your search above and press return to search.

మోడీ 421 సార్లు అలా 758 సార్లు ఇలా..ఈ లెక్క పక్కానట ?

విజయం శ్వాసగా చేసుకుని తన దారి రహదారి అన్నట్లుగా ముందుకు సాగే నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని మొత్తానికి ముగించారు.

By:  Tupaki Desk   |   31 May 2024 2:30 AM GMT
మోడీ 421 సార్లు అలా  758 సార్లు ఇలా..ఈ లెక్క పక్కానట ?
X

దేశాన్ని ఏలే పవర్ ఫుల్ లీడర్ నరేంద్ర మోడీ. ఆయన సంకల్ప బలం గొప్పది. ఆయన పట్టుదల అంతకు మించి గొప్పది. విజయం శ్వాసగా చేసుకుని తన దారి రహదారి అన్నట్లుగా ముందుకు సాగే నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని మొత్తానికి ముగించారు. అది ఎలా చేశారు అంటే సక్సెస్ ఫుల్ గా అని బీజేపీ నేతలు చెబుతారు.

కానీ అలా ఏమీ కాదు అన్నది ఇండియా కూటమి నుంచి వినిపించే ఘాటు విమర్శ. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే మోడీ ప్రసంగాలలో అనేక సార్లు ఈసీ నిబంధలను ఉల్లంఘించారు అని విమర్శించారు.

ఎన్నికల్లో కులాలు మతాలు పేర్లు చెప్పి ఓట్లు అడగరాదు అని ఉన్నా కూడా మోడీ 421 సార్లు మతం గురించి ప్రస్తావన చేశారు అని ఖర్గే చెప్పారు. అలాగే మరో 758 సార్లు తన గురించే ఎక్కువగా చెప్పుకుంటూ మోడీ అంటూ వల్లించారు అని ఇంకో లెక్క చెప్పారు. ఇవన్నీ కరెక్ట్ లెక్కలే అని ఖర్గే నిర్ధారించారు.

ఒక దేశాన్ని ఏలే ప్రధాని ఈ విధంగా మతం గురించి పదే పదే మాట్లాడడం ఎంతవరకూ సమంజసం అని ఆయన ప్రశ్నించారు. మోడీ ఎంతసేపూ ఏదో విధంగా గెలవాలని చూసారు తప్ప దేశ ప్రధానిగా పదేళ్ల పాటు పాలించిన నేతగా ఎక్కడా వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు ఖాయమని ఆయన మరో మారు స్పష్టం చేశారు. ఈసారి ఇండియా కూటమి పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈసారి ఎన్నికల ప్రచారంలో చూస్తే మరో మారు తన మార్క్ ని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకున్నారు అని అంటున్నారు. మే 30 సాయంత్రం తో ముగిసిన ఎన్నికల ప్రచారంలో చూసుకుంటే ప్రధాని మోడీ ఉధృతంగా ఎన్నికల ప్రచారం చేశారు అని చెప్పాలి.

ఆయన ఏకంగా 57 రోజుల పాటు ప్రచారంతో దేశం నలు చెరగులా తిరిగి హోరెత్తించారు. అలాగే ప్రధాని మోడీ మొత్తం 180 సభల్లో పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో మోడీ ఎన్నికల వ్యూహాలు కొత్త పుంతలు తొక్కాయని చెప్పాలి. ఆయన టఫ్ గా ఉంటుంది అనుకున్న చోట ఎక్కువ సీట్లు దక్కాల్సిన చోటనే దృష్టి పెట్టారు. అలా ఆ నాలుగు రాష్ట్రాలపై ప్రధాని మోడీ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా చెప్పుకోవాలి.

అవేంటి అంటే యూపీ, పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర. ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 88 ఎన్నికల ప్రచార సభలను మోడీ నిర్వహించారు. అలాగే 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ పై స్పెషల్ ఫోకస్ తోనే మోడీ ముందుకు సాగారు.

అలాగే బీహార్ లో 20, మహారాష్ట్రలో 19 ఎన్నికల సభలను నిర్వహించిన మోడీ పశ్చిమ బెంగాల్ లో 18 ప్రచార సభల్లో పాలు పంచుకున్నారు. ఇక ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో 35 సభలలో ఆయన హోరెత్తించారు. అందులోనూ కర్ణాటక, తెలంగాణలో 11 సభల్లో పాల్గొన్న ప్రధాని మోడీ బీజేపీకి సౌత్ ఇండియా లో బలం పెంచాలని చూశారు.