Begin typing your search above and press return to search.

కేజ్రీనే కింగ్ పిన్.. 100 కోట్లలో కొంత వాడుకున్నారు.. ఈడీ 7వ చార్జిషీట్

ఈ మేరకు మనీ ల్యాండరింగ్ కోర్టులో ఏడో చార్జిషీట్ వేసింది. 209 పేజీలతో కూడిన ఈ చార్జ్ షీట్ ను కోర్టు స్వీకరించింది.

By:  Tupaki Desk   |   11 July 2024 8:47 AM GMT
కేజ్రీనే కింగ్ పిన్.. 100 కోట్లలో కొంత వాడుకున్నారు.. ఈడీ 7వ చార్జిషీట్
X

‘‘ఈ కుంభకోణంలో ఆయనే కింగ్ పిన్. ప్రాథమిక లబ్ధిదారు కూడా. రూ.100 కోట్లలో కొంత డబ్బును వాడుకున్నారు. వాటితోనే గోవాలోని విలాస హోటల్ లో బస చేశారు. మద్యం విధానంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేశామంటూ ఆయన చెప్పడం పెద్ద కట్టుకథ’’ అని ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలు చేసింది. ఈ మేరకు మనీ ల్యాండరింగ్ కోర్టులో ఏడో చార్జిషీట్ వేసింది. 209 పేజీలతో కూడిన ఈ చార్జ్ షీట్ ను కోర్టు స్వీకరించింది. శుక్రవారం కేజ్రీని హాజరుపరచాలని వారెంట్ జారీ చేసింది.

100 కోట్లలో 45 కోట్లు వాడుకున్నారు..

ఢిల్లీ మద్యం విధానంలో సౌత్‌ గ్రూప్‌ తో పాటు రాజకీయ నేతలు, వ్యాపారులు ఆప్ నకు రూ.100 కోట్ల ముడుపులిచ్చారని.. ఇందులోంచే రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఖర్చులకు వాడారని, ఆ వివరాలను ఎన్నికల సంఘానికీ చెప్పలేదని ఆరోపించింది. రూ.100 కోట్లకు సంబంధించి సేకరణ, అట్టిపెట్టుకోవడం, బదిలీ.. ప్రతి దశలో కేజ్రీకి సమాచారం ఉందని పేర్కొంది. కలిగి ఉన్నారు. గోవాలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌ లో కేజ్రీ బస చేసిన బిల్లును కేసులో కీలక నిందితుడు అయిన చన్‌ప్రీత్‌ సింగ్‌ చెల్లించారని తెలిపింది. ఈ విధంగా.. మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీ శిక్షకు అర్హుడని ఈడీ పేర్కొంది. 11 సార్లు ఆయన స్టేట్‌ మెంట్ రికార్డు చేయగా.. ఎప్పుడూ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ఫోనం పాస్‌ వర్డ్‌ లను ఇవ్వొద్దని లాయర్లు చెప్పారని.. రూ.100 కోట్లలో ఢిల్లీ నుంచి గోవాకు రూ.25.5 కోట్లను వినోద్‌ చౌహాన్‌ బదిలీ చేశారని, ఇతడూ కీలక నిందితుడేనని ఈడీ ఆరోపించింది.

కవిత, సౌత్ గ్రైప్ కూట్ర..

ఢిల్లీ మద్యం కుంభకోణంలో విజయ్‌ నాయర్‌ మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ చార్జిషీట్ లో చెప్పింది. ఎల్‌-1గా ఉన్న మద్యం వ్యాపారులు ముడుపులు ఇవ్వలేదని.. పంజాబ్‌ లో వారిని ఇబ్బంది పెట్టినట్లు ఆరోపించింది. బీఆర్ఎస్ నాయకురాలు కవిత సౌత్‌ గ్రూప్‌ తో కలిసి కుట్ర పన్నారని.. విజయ్‌ నాయర్‌ ద్వారా రూ.100 కోట్లను ఆప్‌ నేతలకు అందించారని పేర్కొంది. ఈ మొత్తం కుంభకోణం రూ.1,100 కోట్లు కాగా.. రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నకు ముట్టాయని తెలిపింది. కేజ్రీకి తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేశామని.. వాటిని ఆయన పట్టించుకోలేదని ఈడీ పేర్కొంది. కాగా, ట్రయల్‌ కోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ఆప్‌ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ పై విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.