Begin typing your search above and press return to search.

బెంగుళూరు రేవ్ పార్టీలో కొత్తకోణం !

హెబ్బగోడి స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులని సస్పెండ్ చేశారు.

By:  Tupaki Desk   |   24 May 2024 2:08 PM GMT
బెంగుళూరు రేవ్ పార్టీలో కొత్తకోణం !
X

ఉరుము ఉరిమి మంగళం మీద పడిందని బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల కొంప మీద కూలుతున్నది. బెంగళూరు జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకొక అంశం ఈ రేవ్ పార్టీ కేసు గురించి తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో ముగ్గురు పోలీసు అధికారుల మీద వేటు పడింది. హెబ్బగోడి స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులని సస్పెండ్ చేశారు.

హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్సై నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులను సస్పెండ్ చేశారు. పార్టీ గురించి సమాచారం ఉన్నా.. నిర్లక్ష్యంగా వహించినందుకు బెంగళూరు రూరల్ ఎస్పీ సస్పెండ్ చేసినట్టు చెబుతున్నారు. ఇక వీరు కాకుండా అనేకల్ ఏఎస్పీ మోహన్ కుమార్, ఇన్స్పెక్టర్ అయ్యన్న యాదవ్ లకు నోటీసులు జారీ చేశారు. అంతేకాక రేవ్ పార్టీ ఘటనలో మరో ఇద్దరికి ఎస్పీ మెమో జారీ చేశారు.. డిప్యూటీ ఎస్పీ, ఎసై లకు మెమో జారీ చేసిన ఎస్పీ మల్లికార్జున్ రేవ్ పార్టీ జరుగుతున్నా సమాచారం ఎందుకు లేదో వివరణ ఇవ్వాలని కోరారు.

ఇక ఈ కేసులో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 నాగబాబు, A4 రణధీర్ బాబు, A5 మహమ్మద్ అబూబాకర్, A6 గా గోపాల్ రెడ్డిని నమోదు చేయగా A7 గా 68 మంది యువకులు, A8 30 మంది యువతులను చేర్చారు. మొత్తంగా ఈ కేసులో 14.40 గ్రాముల MDMA పిల్స్, 1.16 గ్రామ్స్ MDMA క్రిస్టల్, 5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని తేలింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే.. 86 మందికి డ్రగ్స్ ట్రెస్ట్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. ఈ కేసులో నటి హేమ ఇరుక్కుని తప్పించుకోవడానికి ప్రయత్నించిన తీరు కలకలం రేపింది. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.